‘మర్కజ్’పై కేంద్రానికి చెప్పిందే మేమే, తెలంగాణ నుంచే 1200 మంది: ఈటెల క్లారిటీ
హైదరాబాద్: కరోనావైరస్ ప్రభావం మనదేశంలో అంతగా లేదనుకుంటున్న తరుణంలో ఢిల్లీ మర్కజ్ మసీదు ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో 2వేల మందికిపైగా దేశంలోని, విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు పాల్గొనడం, వారిలో కొందరికి వైరస్ సోకడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అధిక సంఖ్యలో ఉండటం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ పరిణామంతో తెలుగు రాష్ట్రాల్లో కోరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

తెలంగాణ నుంచి 1200..
కాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 1200 మంది ఢిల్లీలోని మర్కజ్కు వెళ్లారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని చెప్పారు. ఈ మేరకు ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.

మరో ఇద్దరు డిశ్చార్జ్..
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మందికి బుదవారం నెగిటివ్ వచ్చిందని, మరోసారి వారిని పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని మంత్రి ఈటెల తెలిపారు. బుధవారం మరో ఇద్దరిని డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. డిశ్చార్జ్ అయిన వారుకూడా 14 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉంటాలరని తెలిపారు.

మర్కజ్పై కేంద్రానికి మేమే చెప్పాం..
ఢిల్లీలోని మర్కజ్ గురించి ముందుగా కేంద్రానికి తామే చెప్పామని ఆయన అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంంటే ముందు లాక్ డౌన్ ప్రకటించింది కూడా తెలంగాణే అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ.. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని కోరారు. కరోనా లక్షణాలున్నట్లు అనుమానం కలిగితే వెంటనే ఆస్పత్రిలో చేరాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

మేడ్చల్ నుంచి 53 మంది.. కరోనాపై కేసీఆర్ సమీక్ష
మేడ్చల్ జిల్లాకు చెందిన 53 మంది ఢిల్లీలోని నిజాముబద్దీన్ తబ్లిగి జమాత్కు హాజరైనట్లు మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ తెలిపారు. ఆ 53 మందిని ఐసోలేషన్కు తరలించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. కాగా, నిజామాబాద్ జిల్లాలో బుధవారం మరో పాజిటివ్ కేసు నమోదైంది. ఇది ఇలావుండగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications