బోనమెత్తిన భాగ్యనగరం.. పల్లెగా మారనున్న పట్నం

హైదరాబాద్ : ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. జగదాంబ తల్లిని కొలిచి మొక్కుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు భక్తులు. వేడుకల్లో భాగంగా లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. ఇవాళ్టి నుండి ఆగస్టు ఒకటో తేదీ వరకు గోల్కోండ కోట కిటకిటలాడనుంది. అమ్మవారికి అషాఢమాస బోనాలు సమర్పించేందుకు భక్తుల పెద్ద ఎత్తున క్యూ కడతారు. బోనాల జాతర సందర్భంగా ప్రత్యేకత సంతరించుకునే బోనం, ఘటం, రంగం తదితర అంశాలతో పాటు బోనాల విశిష్టత తెలియజేస్తూ వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.

బోనాల సందడి.. నెల రోజులు పండుగే..

బోనాల సందడి.. నెల రోజులు పండుగే..

పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఇలా ప్రతి అంశం బోనాల జాతరలో భిన్నమైందే. నెల రోజుల పాటు సందడిగా సాగే ఆషాఢమాసం బోనాల జాతరకు శ్రీకారం చుడుతూ గోల్కోండ కోటలో గురువారం (04.07.2019) నాడు అంకురార్పణ జరిగింది. జగదాంబ అమ్మవారిని కొలిచి మొక్కుతూ భక్తజనులు బోనాల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపులో దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో.. 27, 28 తేదీల్లో ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజలో బోనాల వేడుకల అంగరంగ వైభవంగా జరగనుంది.

గ్రామదేవతలకు పూజలు.. తల్లీ సల్లంగా సూడమ్మా

గ్రామదేవతలకు పూజలు.. తల్లీ సల్లంగా సూడమ్మా


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల జాతర. అప్పట్లో కలరా, మలేరియా, మశూచి, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలి.. చాలామంది ప్రజలు చనిపోయారట. ఆ క్రమంలో గ్రామ దేవతలను కొలుస్తూ నిర్వహిస్తున్న పూజలే బోనాలుగా ప్రసిద్ధిగాంచాయి. అంటువ్యాధులు ప్రబలకుండా సకాలంలో వర్షాలు పడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మోర్లకు మొక్కడమే బోనాల పరమార్థం.

బోనాల జాతరలో హైదరాబాద్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గల్లీగల్లీలో, బస్తీబస్తీలో అమ్మవారి అంశలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ తదితర గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇంటిల్లిపాదిని సల్లంగా సూడమ్మా అంటూ వేడుకుంటారు.

 బోనం.. గావు

బోనం.. గావు

భోజనం అని అర్థం వచ్చే బోనం దేవికి సమర్పించే నైవేద్యం అన్నమాట. భక్తిశ్రద్ధలతో మహిళలు పాలు,పెరుగు, బెల్లం లాంటి పదార్ధాలతో వండిన అన్నంతో బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో పెట్టి.. తలపై ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవార్ల గుళ్లకు వెళ్లడం ఆనవాయితీ. బోనం పెట్టే కుండలను గానీ, రాగిపాత్రలను గానీ చూడచక్కగా అలంకరిస్తారు. పసుపు కుంకుమ బొట్లు పెట్టి వేప కొమ్మలతో ముస్తాబు చేసి అందులో బోనం పెట్టి తీసుకెళతారు. ఆ పాత్ర పైభాగంలో దీపం వెలిగిస్తారు. అలా తయారుచేసిన బోనాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు.

ఇక బోనాల సందర్భంగా గావు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పోతురాజు రూపంలో ఉన్నవారికి పూనకం వస్తుంది. దాంతో కోపంతో వారు ఊగిపోతుంటే.. అది తగ్గించడానికి మేకపోతును అందించడం జరుగుతుంది. పోతురాజులు మేకపోతును దంతాలతో కొరికి తల, మొండెం వేరు చేస్తుంటారు. దాంతో అమ్మవారికి కోపం తగ్గుతుందనేది ఒక నమ్మకం.

 రంగం.. ఘటాల ఊరేగింపు

రంగం.. ఘటాల ఊరేగింపు

బోనాల జాతర తర్వాత రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. పచ్చికుండపై నిలబడే మాతంగిని అమ్మవారు ఆవహించి భవిష్యవాణి చెబుతుంది. పంటలు ఎలా పండుతాయి, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది తదితర అంశాలను ప్రస్తావిస్తూ రంగం భవిష్యవాణి కార్యక్రమం కొనసాగుతుంది. బోనాల జాతరలో ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. కిక్కిరిసిన భక్తుల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలామంది పోటీ పడతారు. గర్భగుడిలోని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఆ అమ్మ అంశను తనలో ఇముడ్చుకుని.. పచ్చికుండపై నిలబడి భక్తి పూనకంతో ఊగిపోతూ భవిష్యవాణి వినిపిస్తారు మాతంగి.

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన పాత్రను ఘటం అని పిలుస్తారు. ఘటాలు, పలహారం బండ్ల ఊరేగింపు కనువిందుగా సాగుతుంది. డప్పుచప్పుళ్ల మధ్య యువతీ యువకులు కేరింతలు కొడుతూ, చిన్నా పెద్దా చిందులేస్తూ సాగే ఈ వేడుక చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

 పోతురాజుల కొరడా దెబ్బ తింటే.. పిశాచాలు ఫట్..!

పోతురాజుల కొరడా దెబ్బ తింటే.. పిశాచాలు ఫట్..!

బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అమ్మవారికి సోదరుడిగా భావించే పోతురాజు చిన్న అంగవస్త్రాన్ని ధరించి.. ఒంటినిండా పసుపు కలర్ వేసుకుని.. కాళ్లకు మువ్వల గజ్జెలు, నోట్లో నిమ్మకాయలు పెట్టుకుని, కంటినిండా కాటుక, నుదుట రూపాయంత పెద్దగా బొట్టు పెట్టుకుని, పేనిన కొబ్బరి లేదా నూలు తాళ్లకు పసుపు రాసి, దానిని కొరడాలా ఝుళిపిస్తూ, బోనాల పాటలకు అనుగుణంగా చిందులేస్తూ సందడి చేస్తారు. ఈ కొరడా దెబ్బ తగిలితే పిశాచాల భయం పోతుందని, దుష్టశక్తులు దూరమవుతాయని, కీడు తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

 ఆధ్యాత్మిక తరంగం వెనుక దాగున్న సైన్స్

ఆధ్యాత్మిక తరంగం వెనుక దాగున్న సైన్స్

బోనాల జాతరలో ఆధ్యాత్మిక ఉట్టిపడటమే కాదు.. సైన్స్ కూడా దాగి ఉందంటారు పెద్దలు. పసుపు, వేపాకు యాంటి బయాటిక్‌గా పనిచేసి సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయని చెబుతుంటారు. అలా వాతావరణాన్ని క్రిమిరహితంగా మార్చడంలో బోనాల జాతర ప్రత్యేకత వేరంటారు. అంతేకాదు సమైక్య జీవనానికి నిదర్శనంగా బోనాల వేడుకలు నిలుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలంతా ఒక్క చోట చేరి సంబరాలు చేసుకుంటే ఐక్యమత్యం వెల్లివిరిస్తుంది కదా. ఇలా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+