అయ్యా.. దొర... స్పందించర... కేసీఆర్పై బండి సంజయ్ గరం..
దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల సీఎంలు అభినందనలు తెలుపుతున్నారు. దాదాపు అందరూ నేతలు కొనియాడుతున్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పత్తా లేకుండా పోయారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. దొర ఎక్కడ అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు.
ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకటించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ఆయన స్పందించకపోవడం సరికాదన్నారు. చేస్తోన్న మంచి పనిని అభినందించాల్సిందేనని స్పష్టంచేశారు. అలా కాక.. తర్వాత విమర్శలు చేయడం కూడా మంచి పద్ధతి కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటే కేసీఆర్కు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించిందని ఆయన వివరించారు. జులై నాటికి మరో 40 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అందుకు నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికీ వ్యాక్సిన్ కొరత ఉంది. కానీ దానిని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది. దేశం కరోనా ఫ్రీగా మారుతుంది. కానీ వైరస్ ఇంపాక్ట్ ఆరేళ్ల వరకు ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. ఇదీ మాత్రం కాస్త ఆందోళన కలిగించే అంశం అవుతుంది.