దీక్షతో పీఠం కదులుతుంది.. అందుకే విమర్శలు: బండి సంజయ్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష కంటిన్యూ అవుతుంది. దీనిపై కూడా టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదీ దుర్మార్గ చర్చ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి తమ పార్టీ కార్యాయలంలో 'నిరుద్యోగ దీక్ష' చేపడుతుంటే ప్రభుత్వాని అభ్యంతరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. 'నిరుద్యోగ దీక్ష'తో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ అహంకార పాలనకు నిదర్శనమని బండి సంజయ్ విమర్శించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా. కేసీఆర్ కళ్లకు కనబడటం లేదా? అని అడిగారు. ఉద్యోగ, ఉపాధి కరువై లక్షలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులు ఈ చర్యను ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన బీజేపీ చేపడుతున్న 'నిరుద్యోగ దీక్ష'కు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను బండి సంజయ్ కోరారు.
బీజేపీ నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ విమర్శలు సరికాదని ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. నిరుద్యోగులను కేటీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఉద్యోగాల పేరుతో ఊరిస్తున్నారే తప్ప నోటిఫికేషన్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. బీజేపీ నేత బండి సంజయ్పై, మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్ది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గులేని దీక్షని అన్నారు. దీక్ష పచ్చి అవకాశవాదమేనని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువతకు ఏం చేసిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క చెప్పే దమ్ముందా? అని కేటీఆర్ నిలదీశారు. ఈ క్రమంలో రాజా సింగ్ సమాధానం ఇచ్చారు.