ఫామ్హౌస్కే పరిమితమైన సీఎం కేసీఆర్.. బండి సంజయ్ విసుర్లు
సమయం దొరికితే చాలు సీఎం కేసీఆర్పై విరుచుకుపడుతుంటారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్, ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో సేద తీరుతున్నారని బండి సంజయ్ అన్నారు. సోమవారం బాబు జగజ్జీవన్రామ్ జయంతి సందర్భంగా సంజయ్ నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఇన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రాలేదని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. అది ఏమైందని సంజయ్ అడిగారు. దళిత సామాజిక సంఘాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ఈ అంశంపై ప్రశ్నిస్తలేరని నిలదీశారు. జగజ్జీవన్రామ్, అంబేద్కర్ స్పూర్తితో శక్తివంతమైన దేశం కోసం పనిచేస్తున్నామని చెప్పారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుందని చెప్పారు. ఆ డబ్బులతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. లేదంటే తగిన సమయంలో ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. అధికార మదంతో కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఫైరయ్యారు.