వాంట్ సీబీఐ ఎంక్వైరీ.. అరెస్టైన ఇద్దరీలో ఒకరు వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు..
జూబ్లీహిల్స్ మైనర్పై రేప్ దుమారం రేపుతోంది. ఘటనపై గంటకో అప్ డేట్ వస్తోంది. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో మైనర్పై అత్యాచారం కేసులో ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి కుటుంబసభ్యుల మీద ఆరోపణలు వస్తోంటే.. సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. హోంమంత్రి, ఎంఐఎం ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబ సభ్యులకు కేసుతో ప్రమేయం ఉందని ఆరోపించారు. హైదరాబాద్ అత్యాచారాలకు అడ్డాగా మారిందని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి.. మైనర్పై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు వక్ఫ్బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నారు. మరో మైనర్ను హైదరాబాద్ శివారులో పట్టుకున్నారు.
ఆమ్నేషియా పబ్లో జరిగిన గ్యాంగ్ రేప్లో కీలక నిందితుడు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ అని వస్తున్న వార్తలపై స్పందించారు. గ్యాంగ్ రేప్తో ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం రాత్రి ఆయన ప్రకటించారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఆ రోజు ఎవరికీ పార్టీ ఇవ్వలేదన్నారు. పార్టీలో పాల్గొన్న వారు, గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ వారు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.