సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు: మంత్రి హరీశ్ రావు
వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోంది. కంటి పరీక్ష చేసిన సంగతి తెలిసిందే. అందరీ హెల్త్ ప్రొఫైల్ రెడీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రభుత్వాసుపత్రులు అంటే ఏదో వెలితి.. ఆ మచ్చను తీసివేయడానికి కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో శస్త్రచికిత్స పరికరాలను ప్రారంభించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్స్ లేక చాలా ఇబ్బంది అవుతోందని మంత్రి అన్నారు. రూ.35 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. లక్ష చదరపు అడుగులు ఉండేలా కొత్త బిల్డింగ్ శంకుస్థాపన చేశామని ఆయన వివరించారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో రూ.2 కోట్లతో సిటీ స్కాన్ ప్రారంభించామని, ఈఎన్టీ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన, కోటి మెటర్నిటీ ఆస్పత్రిలో కొత్త బ్లాక్ ప్రారంభించామని హరీష్ రావు పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో పరిశుధ్యంపై ఫోకస్ చేశామని చెప్పారు. ఇందుకోసం బడ్జెట్ పెంచుకుని, టెండర్ల విషయంలో కండిషన్స్ మార్చామని మంత్రి తెలిపారు. డైట్ కాంట్రాక్ట్ కూడా మార్చి పాత కాంట్రాక్ట్ రద్దు చేశామని వివరించారు. ఇవీ చేయడం వల్ల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది జీతం పెరుగుతుందని.. దాంతోపాటు ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంటాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మే 12 నుంచి 18వ తేదీ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత భోజనం కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఆసుపత్రుల్లో పేషెంట్తో అటెండెంట్ కీ రూ.5 లకే భోజనం అందిస్తామని మంత్రి తెలిపారు.
ఆరోగ్యశాఖలో నియామకాలు జరగుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 26 శాతం ప్రసవాలు పెరిగాయని.. ప్రతి నెలా ప్రోగ్రెస్ రివ్యూ చేస్తున్నామని చెప్పారు. సీ సెక్షన్ రేట్ తగ్గించేందుకు సాధారణ డెలివరీ పెంచేందుకు ఇంసెంటివ్ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి హరీష్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 రేడియాలజీ ల్యాబులను మే 11వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు.