బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి మరో కారుపై పడ్డ కారు: మహిళకు తాకడంతో మృతి, 9మందికి గాయాలు
Recommended Video
హైదరాబాద్: ఇటీవల ప్రారంభమైన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఫ్లై ఓవర్ పై నుంచి వేగంగా వెళుతున్న ఓ కారు కింద పడింది. ఆటో కోసం వేచివున్న మహిళకు ఆ కారు తాకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
కాగా, ప్రమాద ఘటన నేపథ్యంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను మూడు రోజులపాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
బయోవర్సిటీ ఫైఓవర్పై దారుణం.. మితిమీరిన వేగంతో జంప్ కొట్టిన కారు.. (వీడియో)#Hyderabad #flyover #Overspeed pic.twitter.com/NN9dTYROZ8
— Oneindia Telugu (@oneindiatelugu) November 23, 2019

ఫ్లై ఓవర్ పైనుంచి..
అంతేగాక, కింది నుంచి వెళుతున్న మరో కారుపై ఆ కారు పడింది. ఈ ప్రమాదంలో మరికొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ కార్లలోని 9మందికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానికులు సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.

కారు మహిళకు తాకడంతో..
రాయదుర్గం-మైండ్స్పేస్ వెళ్లే ఈ ఫ్లై ఓవర్పై నుంచి పడటంతో వోక్స్ వ్యాగన్ కారు తునాతునకలైంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 15 మీటర్ల ఎత్తునుంచి పడటం.. ఆ కారు ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళకు తాకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా, ఆమె పక్కనే ఉన్న కూతురు తీవ్ర భయాందోళనకు గురైంది. తల్లి కళ్లముందే చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. కారు పడటంతో అక్కడ చెట్లు కూడా విరిగిపడటం గమనార్హం.

అతివేగమే కారణం..
ప్రమాదానికి కారణమైన కారులోని ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొంత భయానక వాతావరనం ఏర్పడింది. ఈ ప్రమాదంతో వాహనదారులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. అతివేగం, రాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకరమైన కారు నెంబర్ టీఎస్ 09ఈడబ్ల్యూ 5659గా గుర్తించారు. కారు బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.
15రోజుల్లో ముగ్గురు..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కాగా, వారంరోజుల క్రితమే ఈ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరగడం గమనార్హం. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఫ్లైఓవర్ ప్రారంభమైన 15 రోజుల్లోనే ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఫైఓవర్ మలుపు వద్ద జాగ్రత్తగా వెళ్లాల్సి ఉండగా.. వాహనదారులు వేగంగా వెళుతుండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ప్రమాద ఘటనతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. కారు అత్యంత వేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై అధికారులతో విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications