తెలంగాణ పై బీజేపి ఫోకస్..!గులాబీని ఓవర్ టేక్ చేయాలనుకుంటున్న కమలం..!!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర బీజేపీ నేతల కదలికల ద్వారా స్పష్టమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనలో ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన అమీత్ షా తెలంగాణ యువతను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని, అందుకు గులాబీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆయన విరుచుకుపడ్డారు. కుటుంబపాలనకు స్వస్తి పలకాలని అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వం కూడా తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అమీత్ షా దిశా నిర్ధేశం చేసారు.
తెలంగాణ బీజేపిలో కొత్త ఉత్సాహం..! ఊపునిచ్చిన అమీత్ షా పర్యటన..!!
తెలంగాణలో బీజేపి బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం విధానాలపై విరుచుకుపడుతూనే యువతను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రజాసమస్యలపై దృష్టి సారించిన బీజేపి చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పావులు కదుపుతోంది. పసుపు రైతుల ఇబ్బందుల తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్యను పరిష్కరించిన రోజున టీఆర్ఎస్ పార్టీ, సీఎం చంద్రశేఖర్ రావు తమ నెత్తిపై గుడ్డ వేసుకుని కూర్చోవాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపి నేతలు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు ఇచ్చిన నిధులను కమిషన్ వచ్చే ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వం మళ్లిస్తోందని బీజేపి ఆరోపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ఆయుష్మాన్ భవను రాష్ట్రంలో అమలు చేయడం లేదని భారతీయ జనతా పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది.
పాలన పడకేసింది..! కూల్చివేతలు ఎందుకంటున్న రాష్ట్ర బీజేపీ..!!
కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్ లో అనుమతి రాకుండా తామే అడ్డుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. అన్నారు. ఢిల్లీలో చాలా సార్లు డిఫెన్స్ అధికారులను కలిసి పెరేడ్ గ్రౌండ్ భూమి ఇవ్వకుండా ఒప్పించామన్నారు. ఇంటర్ ఆత్మహత్యలను మరుగునపరిచేందుకే... ప్రజల దృష్టిని మరల్చేందుకే కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ అంటూ.. కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఎవరైనా తమకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారా.. ఎమ్మెల్యేలకు ఉన్న అసెంబ్లీ సరిపోవడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్..! మండిపడుతున్న బీజేపి నేతలు..!!
ప్రాజెక్టుల్లో డబ్బులు దండుకోవటం అయిపోయింది.. ఇక ఇప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ బిల్డింగ్ ల పేరుతో డబ్బులు దండుకోవడానికి ప్లాన్ చేశారని చంద్రశేఖర్ రావు ను విమర్శించారు. కొడుకును సీఎం చేసేందుకు వాస్తు అడ్డువస్తే వాస్తును సరిదిద్దుకోండి కానీ భవనాలను కూలుస్తారా అని లక్ష్మణ్ మండిపడ్డారు. సెక్రటేరియట్ కూల్చివేయాలన్న సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయాన్ని ప్రజలు మాత్రమే కాదు, ఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఖండించాలని అన్నారు ఎమ్మెల్సీ రామచందర్ రావు. సెక్రటేరియట్ భూమిపూజ చేసినప్పుడు గేట్ దగ్గర అకస్మాత్తుగా ధర్నా చేయాలనుకున్నామనీ, ఐతే.. తమ ఫోన్లు ట్రాక్ చేసి.. ముందస్తుగా అరెస్ట్ చేశారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సీ, ఈ హాస్టల్, ఈసీహెచ్ లను చూస్తే.. పశువులు కూడా ఉండ లేవనీ, ఒకప్పుడు హాస్టళ్లు చాలా బాగుండేవని అన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు ముందుగా వాటిని పునర్ నిర్మించి, సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
కేంద్ర పథకాలకు గండి కొడుతున్న సీఎం..! కేంద్ర ముద్రను చెరిపేసే ప్రయత్నమన్న బీజేపి..!!
వందల కోట్ల రూపాయలతో నిర్మించి... ఇంకా కనీసం ఐదు దశాబ్దాల పాటు రాబోయే భవనాలను కూల్చాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏదో ఆర్థికమైన లావాదేవీల లబ్ది ఉంది కాబట్టే చంద్రశేఖర్ రావు ఈ నిర్ణయం తీసుకున్నారని రామచంద్రరావు అన్నారు. పన్ను కట్టే జనం డబ్బు వృథా అవుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హెరిటేజ్ కల్చర్ ను కాపాడుతున్నారనీ.. పాత భవనాలను కూల్చివేయడం ఎక్కడా లేదని.. తెలంగాణలో మాత్రమే జరుగుతోందని అన్నారు. ఎర్రమంజిల్, అసెంబ్లీ బిల్డింగ్స్ కూడా హెరిటేజ్ కిందకే వస్తాయన్నారు. సిటీ మధ్యలో ఉన్న సెక్రటేరియట్ ను కూల్చాల్సిన అవసరం లేదన్నారు రామచందర్రావు.