కేసీఆర్ సర్కార్కు ఇక ఆసరా ఉండదు, విజయశాంతి విసుర్లు
సీఎం కేసీఆర్పై ముప్పేట దాడి జరుగుతుంది. అటు షర్మిల, ఇటు విజయశాంతి.. కాంగ్రెస్ నేతలు కూడా అటాక్ చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విజయశాంతి తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటనలకే తప్ప.. ఆచరణలో చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఆసరాగా నిలిచి ఆదుకోవలసిన తెలంగాణ సర్కారు ఆ కర్తవ్యాన్ని మరిచిపోయి అధికార ఆసరా కోసం నానా పాట్లు పడుతోందని మండిపడ్డారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచీ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని... 57 ఏళ్ళు దాటినవారికి కూడా మంజూరు చేస్తామని ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఊదరగొట్టిందని గుర్తుచేశారు.

పరిశీలన పూర్తి కాలే..
పెన్షన్లకు సంబంధించి సమయం సమీపిస్తోన్నా వచ్చేసినా పరిశీలన ప్రక్రియ మొదలుకాలేదని చెప్పారు. ప్రకటనను నమ్మి 11 లక్షల మంది ఆసరా పింఛన్లపై ఆశలు పెట్టుకున్నారని వివరించారు. కొత్త అప్లికేషన్లను పరిశీలనకు మార్గదర్శకాలు జారీ కాలేదు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం ఇస్తారా? లేదా... వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారా? వంటి ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు సరికదా... మృతుల స్థానంలో కూడా కొత్తవారికి అవకాశం కల్పించలేదని విజయశాంతి మండిపడ్డారు.

చనిపోయినా.. నో
మూడేళ్లలో ఆసరా లబ్ధిదారులలో 2,21,000 మందికిపైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 28 వేల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి పింఛను నిలిపివేశారు. వీరి స్థానంలో అర్హులైనవారెవరికీ పింఛన్ ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదు. మరోవైపు 57 ఏళ్ళు దాటినవారికి కూడా పింఛన్ మంజూరు చేస్తామని చెప్పింది. అయితే బడ్జెట్ కేటాయింపులు మాత్రం అదనంగా పైసా కూడా పెంచలేదు.

పెంచలే.. అయినా
గతేడాది కేటాయించిన రూ.11,728 కోట్ల బడ్జెట్లో 9 వేల కోట్లు మాత్రమే ఖర్చయినందున.. ఈ సారి బడ్జెట్ కేటాయింపులు పెంచలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 65 ఏళ్ళు దాటిన దరఖాస్తు దారులు 2 లక్షల 86 వేలమంది కాగా... 57-65 ఏళ్ల మధ్య దరఖాస్తుదారులు 7,98,000 మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఏడున్నర లక్షలకు పైగా ఆదనంగా దరఖాస్తులు వచ్చినప్పుడు బడ్జెట్ పెంచకుండా ఆసరా ఎలా సాధ్యమనే ప్రశ్నకు జవాబు లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్కారుకు ప్రజల ఆసరా ఉండదని స్పష్టమవుతోందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications