అప్పుడు విమోచన..ఇప్పుడు సమైక్యతానా, కేసీఆర్పై రాములమ్మ ఫైర్, వీహెచ్ ఇలా
విమోచన దినోత్సవ వేళ నేతల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.నిరంకుశ నిజాం పాలనపై కొట్లాడి 75 ఏళ్ల కింద హైదరాబాద్ సంస్థానాన్ని విడిపించుకున్నాం అని పైర్ బ్రాండ్ విజయశాంతి అన్నారు. ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో జరిగిన ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజలు బానిస జీవితాల నుంచి విముక్తి కలిగిందన్నారు.
ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా దినం అంటున్నారని విజయశాంతి అన్నారు. నిజాం రాజ్యంలో భాగమై ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల వారు సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినంగానే పాటిస్తున్నారు. కవల పార్టీ ఎంఐఎం భయంతో ఆ తేదీని తల్చుకోవడానికే వణికిపోయిన టీఆర్ఎస్ అధినేత, ఇప్పుడు కిందా మీదా పడి దీనికి సమైక్యతా దినం అని కొత్తపేరు పెట్టారని మండిపడ్డారు.
నిజాం సమాధికి వంగి నమస్కారం పెట్టిన కేసీఆర్... సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా వర్ణించడం వెనుక ఊహించని...వారికి నచ్చని ఒక సత్యం కనిపిస్తోంది. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ ఆసేతు హిమాచలాన్నీ ఏకతాటిపై నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టింది కూడా ఇదే రోజున అని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ విమోచన అని, ఇప్పుడేమో సమైక్యత అంటున్నాడని వీహెచ్ ఫైరయ్యారు. బీజేపీ పాత్ర అసలు ఉద్యమంలో లేనే లేదని.. అమిత్ షా మాత్రం గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. సాయుధ పోరాటం తానే చేసినట్లు అమిత్ షా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.