కాళేశ్వరం లోపాలు బయటపడుతున్నాయి.. కక్కుర్తి పడటంతోనే.. విజయశాంతి
తెలంగాణ సర్కార్పై బీజేపీ నేత రాములమ్మ విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. ప్రభుత్వం సంక్షేమం మరచిందని మండిపడ్డారు. చేసిన తప్పులు దాగవని, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో లోపాల్ని ఒక్కొక్కటి బయటపడుతుందని వివరించారు. ప్రభుత్వం ఏ స్థాయిలో కాసులకు కక్కుర్తి పడిందో అర్ధం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో లోపాల్ని ఒక్కొక్కటిగా మీడియా బయటపెడుతోందని విజయశాంతి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభించిన నెలన్నర రోజులకే నిర్మాణంలో లోపాలు వెలుగు చూస్తున్నాయని గుర్తుచేశారు. దీనినిబట్టి ప్రభుత్వం ఏ స్థాయిలో కాసులకు కక్కుర్తి పడిందో అర్ధం చేసుకోవచ్చని వివరించారు. 2019 సెప్టెంబర్ 3న కన్నెపల్లి ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని పంపుహౌస్ నీట మునిగిందని పేర్కొన్నారు. 200 మీటర్ల పొడవు, ఏడు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిచి మోటార్ల విడిభాగాలు మునిగిపోయాయని విజయశాంతి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయని.. పంపుహౌసుల్లో మోటార్లు నడవకుండా తిప్పలు పెట్టాయని చెప్పారు. కొన్ని రోజులకే లింక్-2లోని లక్ష్మీపూర్ పంపుహౌస్ గోడలు లీకై నీళ్లు లోపలికి వచ్చాయని.. ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాదే కాళేశ్వరాన్ని ఆకాశానికి ఎత్తాలనే ప్రయత్నం మిడ్మానేరు రిజర్వాయర్ను దెబ్బతీసిందని వివరించారు.
దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని విరుచుకుపడ్డారు. డ్యాం ప్రొటోకాల్ పాటించకుండా నిండా నీళ్లు నింపడంతో కట్టకు బుంగపడి రిజర్వాయర్ మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చిందంటే ప్రాజెక్టు నాణ్యత ఏంటో నిర్దారణ అయ్యిందని విజయశాంతి అన్నారు. పాలకులకు దగ్గరయిన నాయకులు కొందరికీ కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు పొందారే గాని, ప్రజల సొమ్ము వృధా అయ్యేలా చేసిన పనులపై ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువయ్యిందిన్నారు. నీటిని తరలించడానికి వినియోగించే కాలువలు కూడా కాంట్రాక్టర్లు ఇచ్చే సొమ్ముకు దాసోహం అయ్యాయే తప్ప, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఉన్న కాలువలు సైతం కొట్టుకుపోయి పంటలు మునిగి పోవడంతో రైతుల దుస్థితి దీనంగా మారిందని విజయశాంతి వివరించారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాల వల్ల కమీషన్లు పొందడమే గానీ రైతులకు ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వమే ఇవాళ రైతుల పాలిట శాపంగా మారిందని వివరించారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం చెబుతారని విజయశాంతి కామెంట్ చేశారు.