తెలంగాణా గవర్నర్ తమిళిసై ని కలిసిన బీజేపీ నేతలు .. రీజన్ ఇదే
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నేతలు తెలంగాణా గవర్నర్ ను కోరారు. అలాగే వలస కూలీల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో వారికి ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని బీజేపీ నేతలు గవర్నర్ కు వివరించారు .
ఇక ఈ నేపధ్యంలో గవర్నర్ ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల సమస్యలను పట్టించుకోని తెలంగాణా సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని సందర్శించే ధైర్యం మంత్రులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోరైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ నేతలు, గవర్నర్ తమిళిసైని కలిసి వినతి పత్రం సమర్పించారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై నిలదీస్తే సీఎం కేసీఆర్ ఎగతాళి చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు సీజన్ లో కరోనా లాక్ డౌన్ ప్రభావంతో రైతులు నిలువునా మునుగుతున్నారు . కష్టపడి పంట పండించిన రైతులకు మద్దతు ధర అందించేందుకు అది చేస్తున్నాం , ఇది చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తున్నా మిల్లర్లు మాత్రం తాలుపేరిట దోచుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు అదనంగా 2 కిలోలు తూకం వేస్తూ దండుకుంటున్నారు. తేమ పేరుతో కూడా దోపిడీ సాగుతుంది. ఇక ఐకేపీ సెంటర్లలో గన్నీ బ్యాగ్స్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం,అకాల వర్షాలతో రైతన్నలు నిలువునా దగా పడుతున్నారు. పంట చేతికి వచ్చినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నారు . ఇక ఈ నేపధ్యంలోనే అన్నదాతకు అండగా ఇటీవల ఉపవాస దీక్ష చేసిన బీజేపీ నేతలు తాజాగా గవర్నర్ తమిళిసై ని కలిసి రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు .