పీకే ఎందుకు అవసరం వచ్చింది.. సీఎం కేసీఆర్పై ఈటల విసుర్లు
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వేడి రగులుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. కేసీఆర్, కేటీఆర్ తదితరుల కామెంట్లకు బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల ముచ్చింతల్లో ప్రధాని మోడీ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆ రెండు పార్టీల మధ్య మాటల గొడవ తారాస్థాయికి చేరిందని అర్థమవుతుంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా లైన్లోకి వచ్చారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
ప్రధాని మోడీని విమర్శించవద్దని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్... ఇప్పుడు అదే ప్రధానిపై నీచంగా మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు ఓడిపోని కేసీఆర్కు, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు అర్థమైపోయాయని తెలిపారు. అందుకే పీకేను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
పీకే కన్నా పెద్ద మేధావులు తెలంగాణలో ఉన్నారని అన్నారు. దుబ్బాకలో, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఇంత చిల్లర వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ను అడిగారు. దళిత బస్తీల్లో కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ నిలదీశారు.
రైతుల ధాన్యం విషయంలో కేసీఆర్ ఇప్పటికే అభాసుపాలయ్యారని వివరించారు. ఇప్పుడు రజకులు, నాయీ బ్రాహ్మణులు, వ్యవసాయ మీటర్ల విషయంలో కూడా అలానే జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ ఒక గురువింద గింజ అని ఈటల రాజేందర్ విమర్శించారు. మోడీతో కేసీఆర్కు పోలిక ఏంటీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ జీవచ్ఛవాల్లా మార్చారని దుయ్యబట్టారు. వారు స్వతంత్రంగా వ్యవహరించలేరని.. తమ అభిప్రాయం కూడా తెలియజేయలేదని చెప్పారు. ఇలా చేయడం సరికాదని కామెంట్ చేశారు. మంత్రులే మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో మిగతా నేతల పరిస్థితి ఏంటీ అని అడిగారు. కేసీఆర్ గురించి ప్రజలకు తెలిసిందని చెప్పారు.