తెలంగాణలో నిరుద్యోగంపై మెట్రో రైలులో బీజేపీ నిరసన (వీడియో)
హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ బీజేపీ నేతలు హైదరాబాద్ మెట్రో రైలులో వినూత్నంగా నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం మరింత పెరిగిందని ఆరోపించారు.
బీజేపీ నాయకుడు విజిత్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు, యువ గ్రాడ్యూయేట్ల వేషాధారణలో హైదరాబాద్ మెట్రో రైల్లో భిక్షాటన చేశారు. నిరుద్యోగులను భిక్షాటన చేసే పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
అయితే, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చేందుకే ఏడేళ్లు పట్టిందని, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మరెంత సమయం పడుతుందని ప్రశ్నించారు.
Dressed in robes and referring to themselves as "graduate beggars", BJP youth members, led by @VijjithVarma, went around asking for alms in the #Hyderabad metro as part of a symbolic protest against unemployment in the state. pic.twitter.com/kf2JUa0wje
— Paul Oommen (@Paul_Oommen) December 17, 2022
మరోవైపు, టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిపికేషన్లు వస్తుంటే.. ఇలా నిరుద్యోగం అంటూ బీజేపీ నేతలు దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూనే ఇలా చేస్తున్నారంటున్నారు. బీజేపీ మద్దతుదారులు వీరికి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఈ అంశంపై ట్వీట్ల యుద్ధం సాగుతోంది.