సీఎం కూతురును, కుడిభుజాన్ని ఓడించాం.. కాంగ్రెస్కు చావు తప్పి కన్ను లొట్ట : బీజేపీ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో అంతులేని ఆనందం తీసుకొచ్చాయి. కారు జోరుకు బ్రేకులు కొడుతూ బీజేపీ అభ్యర్థులు నాలుగు చోట్ల ఘన విజయం సాధించారు. అదే ఊపుతో తెలంగాణలో రానున్నది బీజేపీ రాజ్యమంటున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. అదే క్రమంలో టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు.
తెలంగాణలో బీజేపీ హవాతో టీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని ఏకిపారేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూతురును నిజామాబాద్లో.. ఆయన కుడిభుజాన్ని కరీంనగర్లో ఓడించడం మోడీ హవాకు నిదర్శనమని అంటున్నారు.
ఆసరా పింఛన్లు డబుల్.. జూన్ నుంచే అమలు.. ఉత్తర్వులు జారీ
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశమంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తుంటే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాత్రం చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఒక తీరుగా మాట్లాడి.. ఇప్పుడేమో రివర్స్ గేర్ వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలకు ముందు మోడీ హవా లేదన్న కేటీఆర్.. ఇప్పుడు మాట మార్చి మోడీ హవా అనడానికి అర్థమేంటో చెప్పాలన్నారు.
17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేకపోయిందని అన్నారు లక్ష్మణ్. ఆరు రాష్ట్రాల్లో ఒక్క సీటుకే పరిమితమైందని దుయ్యబట్టారు. యూపీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓడిపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. హస్తం గుర్తుపై గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఆ పార్టీలో ఎంతమంది మిగిలారని ప్రశ్నించారు. కేసీఆర్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని కాంగ్రెస్ నేతలే చెబుతుండటం గమనార్హమని చెప్పుకొచ్చారు.
జాయింట్ కిల్లర్.. కేసీఆర్కు అటు బిడ్డ.. ఇటు కుడిభుజం ఔట్..!
ఉత్తర తెలంగాణలో బీజేపీ విజయఢంకా మోగించిందని.. రాజకీయ ఉద్ధండులను మట్టికరిపించామని అన్నారు లక్ష్మణ్. నిజామాబాద్, కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీలు జాయింట్ కిల్లర్గా సీఎం కూతురు కవితను.. కుడిభుజమైన బోయినపల్లి వినోద్ కుమార్ను ఓడించారని చెప్పుకొచ్చారు. ఇక లోక్సభ ఫలితాల్లో బీజేపీ దెబ్బతో కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అస్త్ర సన్యాసం చేయడంతో దిక్కు దివానం లేకుండా పోయిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని జైలుకు పంపిస్తామన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చల్లబడటానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ నేతలతో ఉత్తమ్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ మీద పోరాడే స్థాయిలో కాంగ్రెస్ లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా ఉందన్నారు. అయినప్పటికీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఇక బీజేపీదే హవా..!
కేసీఆర్ కుటుంబ పాలనతో విసుగు చెంది టీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ బీజేపీలో చేరడంతోనే ఆ పార్టీ పరిస్థితేంటో అర్థమవుతోందన్నారు లక్ష్మణ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్తో భవిష్యత్తులో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ఆకాంక్షించారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమమైనా విజయవంతం అయిందని.. ఇప్పుడు అదే కోవలో బీజేపీ కూడా చేరబోతుందని వ్యాఖ్యానించారు.