పోలీస్ శాఖలో "వసూల్ రాజా".. బెదిరింపులతో ఇంటి నిర్మాణం..! చివరకు..!!
హైదరాబాద్ : వసూలు రాజాల తీరు పోలీస్ శాఖకు తలనొప్పిలా మారింది. మాయని మచ్చను మిగులుస్తూ అప్రతిష్ట పాలు చేస్తోంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ సంస్కరణలు తీసుకొచ్చినా.. వసూలు రాజాల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు కొకొల్లలు. న్యాయం కోసం ఠాణా మెట్లెక్కుతున్న బాధితులకు సైతం తిప్పలు తప్పడం లేదనే వాదనలున్నాయి. ఆ క్రమంలో కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు బాగోతం బయటపడటం స్థానికంగా చర్చానీయాంశమైంది.
Recommended Video


వసూల్ రాజా గుట్టురట్టు
పోలీస్ శాఖలో వసూలు రాజాల తీరు చర్చానీయాంశంగా మారింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో జగద్గిరి గుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన గారి వసూళ్ల బాగోతంపై ఓ దిన పత్రిక ప్రముఖంగా వార్తను ప్రచురించింది. దాంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. శ్రీనివాసులును కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జగద్గిరి గుట్ట సీఐగా పనిచేస్తున్న శ్రీనివాసులుపై చాలా ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. ఆయన బాలాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న సొంతింటి భవన నిర్మాణానికి సాయపడాల్సిందిగా కొందరు వ్యాపారులను బెదిరించినట్లు సమాచారం. అంతేకాదు కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన పలువురి నుంచి ఆయన ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

సీపీ సీరియస్.. కమిషనరేట్కు అటాచ్
వసూలు రాజా అంటూ సీఐ శ్రీనివాసులుపై ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. శ్రీనివాసులు వ్యవహారాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అతడిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. జగద్గిరి గుట్ట కొత్త సీఐగా గంగారెడ్డిని నియమించారు. ఇతను బాలానగర్ స్పెషల్ బ్రాంచ్లో పని చేస్తున్నారు.
2018, సెప్టెంబర్ 13వ తేదీన జగద్గిరి గుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసులు ఆది నుంచి కూడా వివాదస్పదుడిగానే ముద్రపడ్డారు. ఆ క్రమంలో జగద్గిరి గుట్ట పరిధిలోని చాలా ప్రాంతాల్లో పలువుర్ని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కొకొల్లలు. చివరకు గుట్కా, పాన్ పరాగ్లు అమ్మే వ్యక్తుల దగ్గర నుంచి కూడా నెలవారీ మామూళ్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్టేషన్కొచ్చే బాధితులకు అన్యాయమే..!
వసూళ్ల పర్వంలో కింగ్గా పేరొందిన శ్రీనివాసులు స్టేషన్కొచ్చే బాధితులను కూడా వదిలిపెట్టలేదనే ప్రచారం జరుగుతోంది. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు వత్తాసు పలుకుతూ డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో తనను ఓ వ్యక్తి నమ్మించి మోసం చేశాడని ఓ బాలిక పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితుడికి అభయహస్తం ఇచ్చినట్లు సమాచారం.
అంతేకాదు పేకాటరాయుళ్లు, మందుబాబులు ఇలా వసూళ్లకు కాదేదీ అనర్హమన్నట్లుగా ప్రవర్తించారనే వాదనలున్నాయి. మూడు రోజుల కిందట కొంతమంది పేకాటరాయుళ్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీనివాసులుతో పాటు హెడ్ కానిస్టేబుల్, డ్రైవర్ పాత్రపై కూడా అనుమానాలు రావడంతో వారిద్దరిపై కూడా విచారణ జరుగుతోంది. అదలావుంటే అవినీతి ఆరోపణలపై జగద్గిరి గుట్టలో ఇప్పటికే ఇద్దరు సీఐలు బదిలీ అయ్యారు. ఆ క్రమంలో శ్రీనివాసులు బదిలీ కావడంతో ఆ సంఖ్య మూడుకు చేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications