వ్యాపారి కిడ్నాప్ కేసులో ముందడుగు.. నిందితుల గుట్టు రట్టు
హైదరాబాద్ : ఆటో ఫైనాన్స్ వ్యాపారి గజేంద్ర పారిక్ కిడ్నాప్ కథ కొలిక్కి వచ్చింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో దుండగుల ఆట కట్టించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి కేసును చేధించారు. చిక్కడపల్లిలో గజేంద్రను అపహరించిన కిడ్నాపర్లు తొలుత మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అనంతరం బేరసారాలు సాగించి అతడి కుటుంబ సభ్యుల నుంచి కోటి రూపాయలు వసూలు చేసుకుని అబిడ్స్లో వదిలేసి పారిపోయారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటల వ్యవధిలో కిడ్నాపర్లను గుర్తించారు. మహమ్మద్ అల్మాస్, అక్బర్ మీర్ షఫిక్ అలీ, అలియాజ్ అనే నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ వ్యాపారి కిడ్నాప్ కలకలం.. కోటి రూపాయల వ్యవహారం.. నిజమా, డ్రామానా?
ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. అందులో ముగ్గుర్ని అరెస్ట్ చేసి 36 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు వెల్లడించారు. అంతేగాకుండా మూడు వాహనాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే వ్యాపారి గజేంద్ర కిడ్నాప్ కేసులో మాస్టర్ మైండ్ అల్మాస్ అని తేల్చారు. కిడ్నాప్ జరిగిందని తెలియగానే పదకొండు టీమ్స్ రంగంలోకి దిగి 24 గంటల్లో ట్రేస్ అవుట్ చేశాయని వివరించారు.
నగరంలో టెక్నాలజీ ఉపయోగించి ప్రతి కేసును శోధిస్తున్నామని చెప్పుకొచ్చారు సీపీ. వ్యాపారి గజేంద్ర కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను గుర్తించామని తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉండటంతో పూర్తిస్థాయి నగదు రికవరీ కాలేదేని.. పారిపోయిన వారి దగ్గర మిగతా మొత్తం ఉందని చెప్పారు. వ్యాపార లావాదేవీలే కిడ్నాప్కు కారణంగా గుర్తించామని.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్మాస్కు, గజేంద్రకు గతంలో పరిచయం ఉందని తెలిపారు.