రెండు రోజుల్లో సినిమా విడుదల.. ఇంతలో హైదరాబాద్లో దర్శకుడి అరెస్ట్..
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నరసింహ నంది,నిర్మాత శ్రీనివాస్లను బుధవారం ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రీవనం కూడలి వద్ద డిగ్రీ కాలేజీ అనే సినిమాకు సంబంధించి అశ్లీల పోస్టర్లు అంటించారని పలువురు సీనియర్ సిటిజెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసినట్టు సమాచారం.
కాగా,శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై వరుణ్, దివ్యరావు జంటగా నర్సింహ నంది స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిగ్రీకాలేజ్. ఈ నెల 7న విడుదల కానుంది. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకను ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్పై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్లాస్ రూమ్లోనే శృంగారంలో పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే, దర్శకుడు నర్సింహ నంది గతంలో హైస్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి సినిమాలను తెరకెక్కించారు. 2008లో విడుదలైన 1940లో ఒక గ్రామం చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం, నంది పురస్కారాన్ని అందుకున్నారు.