హైదరాబాద్ యూటీ దుమారం: అసద్పై కిషన్ రెడ్డి ఫైర్, బుద్ది ఉందా అంటూ రాజాసింగ్..
హైదరాబాద్ను యూటీ చేయబోతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తేనేతుట్టెను కదిపారు. దీనిపై బీజేపీ నేతలు అదేస్థాయిలో స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసత్య వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల విశ్వసనీయత కోల్పోవద్దని సూచించారు. మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిన్న పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. లోక్సభలో జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ యూటీ..?
మోడీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖండించారు. హైదరాబాద్ను యూటీ చేసే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. జవాబు చెప్పేలోపే ఒవైసీ పార్లమెంట్ నుంచి పారిపోయాడని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం..ఎంఐఎం, టీఆర్ఎస్కు అలవాటుగా మారిందని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుద్ది ఉందా అంటూ..
అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం పార్లమెంట్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తుందని మాట్లాడారన్నారు. అసలు అసదుద్దీన్కు బుద్ధి ఉందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ, ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామెంట్స్ కలకలం
అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. అసద్ ప్రకటనపై బీజేపీ నేతలు ఒంటికాలిపై లేచారు. విచక్షణ లేకుండా ఆరోపణలు చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. దీంతో హైదరాబాద్ యూటీ అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఆర్థిక వనరుల కోసమే ఇలా అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ యూటీ అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.