Telangana: తెలంగాణలో పౌరసత్వ చట్టానికి బ్రేక్..? కేసీఆర్ వైఖరి పట్ల ఉత్కంఠత..!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, హింసాత్మక సంఘటనలకు కేంద్రబిందువైనట్లుగా భావిస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం అమలుకు తెలంగాణలో బ్రేక్ పడనుందా?, ఈ చట్టాన్ని అమలు చేయడానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆసక్తిగా లేదా? అంటే- ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైఖరి ఎలా ఉందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వ్యతిరేకంగా ఓటు..
పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటింగ్ సందర్భంగా టీఆర్ఎస్ తన వైఖరి ఏమిటనేది స్పష్టం చేసింది. లోక్ సభ, రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. తాము ఈ బిల్లును నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కే కేశవరావు రాజ్యసభలో కుండబద్దలు కొట్టారు. అక్కడితో ఆగలేదాయన. దేశాన్ని ముస్లిం రహితంగా మార్చడానికి ఉద్దేశించినట్టుగా కనిపిస్తోందని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.

వ్యతిరేకించే రాష్ట్రాల జాబితాలో..
ప్రతిపక్షాలు, తటస్థ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. పౌరసత్వ సవరణ బిల్లు కాస్తా లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. చట్టంగా రూపు దాల్చింది. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అమల్లోకి తీసుకుని రావాలనేది కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా తమ నిర్ణయాన్ని తీసుకునే వెసలుబాటు ఉంది.

ఆరు రాష్ట్రాల్లో అమలు అసాధ్యమే..?
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీయేతర ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ గఢ్, కేరళ ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొడుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్సార్సీ)ని గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అమలు చేయబోమని చెప్పారు.

అదే జాబితాలో తెలంగాణ కూడా..
తాజాగా- ఆ ఆరు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న బీజేపీతో సై అంటే సై అనే పరిస్థితిలో ఉంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో కేంద్రం భారీగా కోత పెట్టింది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రంపై అసహనంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా- పౌరసత్వ సవరణ చట్టాన్ని సైతం అమలు చేయకపోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications