మొగులయ్య రూ.కోటి: ఇంటి స్థలం కూడా, కేసీఆర్ సత్కారం
కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్లో ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయల రివార్డ్ ప్రకటించారు. ఇటీవల ఆయన పద్మశ్రీ అవార్డు దక్కించున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. మొగులయ్యను శాలువాతో కేసీఆర్ సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ కళాకారుడు మొగులయ్య అని కేసీఆర్ అభినందించారు. ఆయను పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మొగులయ్యకు ఇంటి స్థలం, నగదు పురస్కారం ప్రకటించారు. మొగులయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. ఇప్పటికే మొగులయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని కేసీఆర్ మరోసారి చెప్పారు. తాతల నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకోవాలన్న తాపత్రయం చాలా మందికి ఉంటుంది. కానీ కళని కాపాడుకోవాలని మొగులయ్య తపన పడ్డారు.
12 మెట్ల కిన్నెరను వాయించడంలో మొగులయ్య నేర్పరి. పూట గడవని దుర్భర జీవితం. భార్య, 9మంది పిల్లలను పోషించడం కోసం చాలా కష్టాలు పడ్డాడు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట ఆయన స్వస్థలం. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరి తరం కళాకారుడు. కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైందని అంటుంటారు. సీఎం కేసీఆర్ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు. మొగిలయ్య 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే.
అంతరించిపోతున్న కిన్నెర కళని ఈ తరానికి రుచి చూపించాడు. భీమ్లా నాయక్ మూవీలో టైటిల్ సాంగ్ పాడటంతో.. దర్శనం మొగులయ్య తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. అంతకు ముందు వరకు కొంతమందికి మాత్రమే తెలిసిన మొగిలయ్య.. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పద్మ శ్రీ పురస్కారం కూడా వరించింది.