సీఎం కేసీఆర్ బిజీ బిజీ..17వ తేదీ నుంచి సమీక్షలు, జిల్లాల పర్యటనలు.. ఇదీ షెడ్యూల్
తమిళనాడు పర్యటన ముగిసిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ మరింత బిజీ అవుతున్నారు. రెండురోజులు పాలనా అంశాలపై ఫోకస్ చేస్తారు. మళ్లీ 17వ తేదీ నుంచి సమీక్షలు.. జిల్లాల బాట పట్టబోతున్నారు. 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, కేడీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహిస్తారు.
18వ తేదీన కలెక్టర్లతో భేటీ
18వ తేదీన దళితబంధుతోపాటు పలు అంశాలపై కలెక్టర్లతో భేటీ అవుతారు. ప్రగతిభవన్లో జరిగే సమావేశంలో మంత్రులు, సీఎస్ సోమేశ్కుమార్, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. దళిత బంధుతో పాటు ఇతర అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలైన విషయం తెలిసిందే. మిగతా చోట్ల అమలు గురించి డిస్కష్ చేస్తారు. హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలో పథకం తెరపైకి తీసుకొచ్చారని.. తర్వాత మరచిపోయారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ రివ్యూ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జిల్లాల పర్యటన
ఆ మరునాడు జిల్లాల బాట పడతారు. 19వ తేదీన వనపర్తి జిల్లాలో, 20వ తేదీన జనగామ జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. వికారాబాద్, జనగామతో పాటు త్వరలో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటనలో ఉమామహేశ్వర లిఫ్ట్, రిజర్వాయర్కు, వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేస్తారు. నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లో గల కలెక్టరేట్లను ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జిల్లాల పర్యటనలో ఆయా జిల్లాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
పార్టీ పటిష్టత గురించి ఫోకస్
పార్టీ పటిష్టత గురించి లీడర్లతో చర్చిస్తారు. కరోనా సమయంలో పలు జిల్లాల్లో వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచిన సంగతి తెలిసిందే. సీటీ స్కాన్ మెషినరీతోపాటు.. డయాలసిస్ ఎక్విప్ మెంట్ అందుబాటులోకి తెచ్చింది. పట్టణాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లను సీఎం విజిట్ చేసి సౌకర్యాలు పరిశీలిస్తారు. కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో వసతులపై రివ్యూ చేస్తారు.