నిఖత్ జరీన్కు శుభాకాంక్షల వెల్లువ: సీఎం కేసీఆర్, బండి సంజయ్, పవన్
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ సత్తా చాటారు. ఆమె విశ్వ విజేతగా నిలవడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ను సీఎం అభినందించారు.
ప్రోత్సహిస్తాం..
ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్లో విజేతగా నిలవడం గర్వించదగిన విషయం అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
గర్వకారణం
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం దేశానికి గర్వ కారణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వర్ణ పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
యువతకు స్పూర్తి
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఫైనల్స్లో బౌట్ ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తూ రింగ్లో దూకుడుగా ఆడిన విధానం ప్రశంసనీయమన్నారు. నిఖత్ జరీన్ క్రీడా ప్రస్థానం, విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
చరిత్ర పుటల్లో
యువ బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్గా అవతరించారు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఘన విజయం సాధించారు. థాయ్ల్యాండ్కు చెందిన జిట్పాంగ్ను చిత్తు చేశారు. దాంతో ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా అవతరించారు. ఈమె స్వస్ధలం తెలంగాణలో గల నిజామాబాద్.. నిఖత్ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.