చేతులెత్తి మొక్కుతున్నా.. జనతా కర్ఫ్యూ 24గంటలకు పొడగింపు : కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 24 గంటల జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా స్వచ్చందంగా స్వీయ నియంత్రణలో ఉండాలని పిలుపునిచ్చారు.
యావత్ దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ ప్రజలు ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటిరోజు 6గంటల వరకు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పారు. ఎంత పెద్ద విపత్తు వచ్చినా తెలంగాణ సమాజం ఐక్యంగా ఉంటుందని చాటి చెప్పేలా ప్రజలంతా 24 గంటల పాటు చీమ చిటుక్కమనకుండా కర్ఫ్యూ పాటించాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో సకలం బంద్ చేశామని.. అదే స్పూర్తితో 24గంటల కర్ఫ్యూని పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దన్నారు. ప్రజలందరికీ తాను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అలాగే విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినవారికి చేతులెత్తి మొక్కుతున్నానని.. వాళ్లంతా స్వచ్చందంగా స్థానిక ఆసుపత్రులు లేదా పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని చెప్పారు.

వాళ్లంతా స్వచ్చందంగా రిపోర్ట్ చేయాలి
విదేశాల నుంచి వచ్చినవారు కూడా తమ బిడ్డలేనని.. అయితే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.దాదాపు 20వేల మంది విదేశాల నుంచి తెలంగాణకు వచ్చారని.. వారందరి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 11వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నట్టు చెప్పారు. మిగతావాళ్లు స్వచ్చందంగా రిపోర్ట్ చేస్తే సమాజానికి మంచి చేసినవారవుతారని తెలిపారు. శనివారం(మార్చి 10) ఒక్కరోజే విదేశాల నుంచి 1500 మంది తెలంగాణకు వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5274 సర్వైలైన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.

కీలక కమిటీ ఏర్పాటు.. అత్యవసర చర్యలు..
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం బస్సులు,మెట్రో,వర్తక వ్యాపారాలు అన్నీ బంద్ అని సీఎం తెలిపారు. కేవలం అత్యవసర సేవలైన అంబులెన్సులు,ఆసుపత్రులు,అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదే సమయంలో ప్రతీ బస్సు డిపోలో 5 బస్సులను,10మంది సిబ్బందిని అత్యవసర సేవల నిమిత్తం అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే అత్యవసర సేవల కోసం 5 మెట్రో రైళ్లు అందుబాటులో ఉంచుతామన్నారు. అవసరమైతేనే అవి తిరుగుతాయని.. ఎక్కడివక్కడే ఉంటాయని తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క ముంబై హైవే మార్గంలోనే 78 హెల్త్ టీమ్స్ను మోహరించినట్టు తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ,చీఫ్ సెక్రటరీ,నిపుణలు ఆధ్యర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలు వంటి వాటిపై ఆ కమిటీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుందన్నారు.

కరోనా పేషెంట్ల ఖర్చు ప్రభుత్వానిదే..
ఇప్పటివరకు రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. వారంతా విదేశాల నుంచి వచ్చినవారే అని చెప్పారు. కుటుంబంలో ఎవరికైనా వైరస్ సోకినా..అనుమానిత లక్షణాలు ఉన్నా..
కుటుంబ సభ్యులు రిపోర్ట్ చేయాలన్నారు. జ్వరం,దగ్గు,జలుబు లక్షణాలు,శ్వాసకోశ వంటి సమస్యలు ఉంటే తక్షణం రిపోర్ట్ చేయాలన్నారు. స్థానిక కౌన్సిలర్లు,కార్పోరేటర్లు కూడా వారి వారి ఏరియాల్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినవారు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరు రిపోర్ట్ చేసినా.. వారి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తీవ్రతను బట్టి గాంధీకి తరలించడం లేదా ఇంట్లోనే క్వారెంటైన్ చేస్తారని చెప్పారు. ఒకవేళ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ప్రదేశాలకు తరలిస్తామన్నారు.

సాయంత్రం 5గంటలకు సంఘీభావం తెలపాలి.. మహారాష్ట్ర సరిహద్దులు మూసివేసే ఛాన్స్
మరో రెండు,మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించి మహారాష్ట్ర సరిహద్దులను మూసివేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు సీఎం తెలిపారు. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత రీత్యా సరిహద్దు మూసివేతపై ఆలోచిస్తున్నామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాకే చర్యలు తీసుకుంటామన్నారు. వైరస్ నియంత్రణపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని సీసీఎంబీ సహా ప్రతీ రిసోర్స్ను ఉపయోగించుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. సీసీఎంబీలో ఒకేసారి 1000మందికి వైద్య పరీక్షలు నిర్వహించే కెపాసిటీ ఉందన్నారు. ఇక కర్ఫ్యూ రోజున సాయంత్రం 5గంటలకు ఐదు నిమిషాల పాటు ప్రతీ ఒక్కరూ తమ బాల్కనీలు లేదా ఇంటి ఆవరణలో చప్పట్లు కొట్టడం లేదా ఏదైనా వస్తువులను మోగించడం ద్వారా సంఘీభావం ప్రకటించాలన్నారు. జాతి ఐక్యతను చాటే ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. కొంతమంది దీనిపై కూడా సోషల్ మీడియాలో ప్రధానిని విమర్శిస్తున్నారని.. అది సరైన పద్దతి కాదని హెచ్చరించారు. అవసరమైతే అలాంటివారిపై కేసులు పెట్టాలని డీజీపిని కోరారు. దయచేసి రాబోయే రెండు మూడువారాలు 60 ఏళ్ల పైబడ్డ వృద్దులు,10 ఏళ్ల లోపు చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. ప్రభుత్వం ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని.. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు. అయితే వైరస్ నియంత్రణకు ప్రజల సహకారం తప్పనిసరి అని తెలిపారు.












Click it and Unblock the Notifications