కరోనాపై జోక్ పేల్చిన కేసీఆర్.. అందరూ పగలబడి నవ్వేశారు...
చెప్పే విషయమేదైనా ప్రజలకు వంద శాతం కమ్యూనికేట్ చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన ప్రసంగాలకు ప్రత్యర్థులు కూడా ముగ్దలవుతారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రెస్ మీట్ నిర్వహించిన కేసీఆర్.. సీరియస్గా సాగుతున్న సమావేశంలో తనదైన శైలిలో నవ్వులు పూయించారు. కరోనా వైరస్పై ఆయన చెప్పిన జోక్కి అంతా పగలబడి నవ్వారు. కరోనా వైరస్ గురించి ఇటీవల ఓ జోక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని చెప్పిన కేసీఆర్.. కరోనా వైరస్ అత్యంత స్వాభిమాని అని చెప్పారు. అది ఉన్నచోటనే ఉంటుంది తప్ప మరో చోటుకు కదలన్నారు. ఎవరైనా వెళ్లి దాన్ని తాకితే తప్ప మరోచోటుకు వెళ్లదన్నారు. కాబట్టి ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండి కరోనా వైరస్ స్వాభిమానాన్ని దెబ్బకొట్టాలన్నారు. కరోనాకు స్వాభిమానం ఎక్కువంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అందరిలో నవ్వులు పూయించాయి.
ఇక కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దులను మూసివేసే ఆలోచన చేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. దాదాపు 500-600కి.మీ తెలంగాణతో మహారాష్ట్ర సరిహద్దు ఉన్న నేపథ్యంలో.. వైరస్ కట్టడి కోసం సరిహద్దులు మూసివేయాల్సిన అవసరంపై ఆలోచిస్తున్నామన్నారు. మరో 2,3 రోజుల్లో దీనిపై సమీక్ష నిర్వహించి.. మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాకే సరిహద్దులను మూసివేస్తామన్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్,నిజామాబాద్ ప్రాంతాల ప్రజలకు బల్లార్షా,చంద్రపూర్,యావత్మాల్,ధర్మాబాద్ వంటి చోట్ల చాలా బంధుత్వాలు ఉన్నాయని.. కాబట్టి అక్కడినుంచి ఇక్కడికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తప్పవన్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నా.. పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నందునా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారను.
ఇక కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ విధించిన జనతా కర్ఫ్యూని సీఎం కేసీఆర్ 24గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ప్రజలు,వర్తక,వ్యాపార,వాణిజ్య సంఘాలన్నీ స్వచ్చందంగా కర్ఫ్యూలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల బంద్ లాంటివి చాలా నిర్వహించామని.. అదే స్పూర్తితో 24గంటల కర్ఫ్యూని విజయవంతం చేయాలని సూచించారు.