యాదాద్రి పున:ప్రారంభం.. పనుల తీరుపై కేసీఆర్ సమీక్ష
యాదాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభిస్తారు. గడువులోపల తుది మెరుగుల పనులను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతిభవన్లో శుక్రవారం సమీక్షించారు. యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణ పనుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యాచరణ గురించి సీఎం ఆలయ అధికారులతో చర్చించారు.
సూచనలు ఇవీ..
అలంకరణ గురించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని సూచించారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు చూపించారు. వీటిని పరిశీలించి ఒకదానిని ఖరారు చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని గడువు విధించారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని తెలిపారు.
గుడి కనిపించేలా..
శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని, ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించేలా తుదిమెరుగులు దిద్దాలని సూచించారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టుగా, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనం ఇవాలన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్ తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడల మీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు.
లాన్ మధ్యన దీపస్తంభం..
80 ఫీట్ల పొడవు వున్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితం అవుతున్నదని ప్రశంసించారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం కేసీఆర్ తిలకించారు.
రాతి కట్టడాలతో..
నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.