TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.

కీలక సమావేశం
ఈ సమీక్ష సమావేశంలో గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే విషయంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ఆర్డర్ కాపీలు ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

చర్చల జరపాలంటూ ఆదేశాలు..?
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే.. కార్మికులతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో మంత్రికి, అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఆర్టీసీ సంఘాల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం మినహా మిగితా అన్ని డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం అంగీకరించారా?
ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మిక సంఘాల నేతలు చర్చించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మె విరమించడంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్లను పక్కనే పెడితేనే చర్చలకు ప్రభుత్వం సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

18రోజులుగా సమ్మె..
హైకోర్టుకు ప్రభుత్వ చర్యలపై వివరించాల్సిన నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు నడుపుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో బస్సులు తిరగడం లేదు. ప్రైవేటు డ్రైవర్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.












Click it and Unblock the Notifications