సీఐపై బూతుపురాణం.. నేను అనలే, మాటలు వక్రీకరించారు: పట్నం మహేందర్ రెడ్డి
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.. సీఐపై బూతుపురాణం వినిపించిన ఆడియో వైరలైంది. దీంతో పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. అసలు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. సీఐతో మాట్లాడింది వాస్తవమని, ఒక్కరు కాదు.. ఇద్దరు సీఐలతో మాట్లాడానని మహేందర్ అంటున్నారు. తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు.
తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పక్కన ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారని.. వారిలో జగన్ అనే వ్యక్తి మొన్ననే జైలు నుంచి వచ్చాడని పట్నం తెలిపారు. తను తాండూరు ప్రజలను రౌడీషీటర్లు అనలేదు. రోహిత్ పక్కన ఉన్న కొందరు కార్యకర్తలను ఉద్దేశించి అన్నానని వివరించారు. సీఐతో మాట్లాడింది వాస్తవం. అయితే, తన మాటలను వక్రీకరించారు. తాండూరులో ఇసుక దందా జరుగుతోందని.. ఆ విషయం అందరికీ తెలుసు అని చెప్పారు.
తాండూరులో ధర్నా చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు అని వివరించారు. సీఐ ఎంత అవినీతికి పాల్పడింది ప్రజలకు తెలుసు. అవినీతి సొమ్ముతో అక్రమ బిల్డింగులు కడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్ వద్ద తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కామెంట్ చేశారు. ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తనకు అసలు పోటీయే కాదని పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
రోహిత్ అసలు తనకు పోటీయే కాదని చెప్పారు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే, అంత మంచిదన్నారు. తాండూరులో తనే సీనియర్ అని.. కేటీఆర్, కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని చెప్పారు. రోహిత్ రెడ్డి వన్ టైమ్ ఎమ్మెల్యే. మళ్లీ గెలవడం జరగదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తననే పోటీ చేయమని అడుగుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు సానుభూతితో రోహిత్ రెడ్డికి ఓటు వేశారని వివరించారు. కానీ తను ఫ్రస్ట్రేషన్లో ఉన్నానని అంటున్నారు. తను హ్యాపీగా ఉన్నానని స్పష్టంచేశారు.