కాంగ్రెస్ ను తీసిపారెయ్యలేం.. తమ క్యాడర్ మధ్యనే తీవ్ర పోటీ .. మునిసిపల్ ఎన్నికలపై కేటీఆర్
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగిన నేపధ్యంలో అన్ని పార్టీలు ఇప్పటి నుండే కసరత్తులు పెట్టాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నద్ధం అవుతున్నాయి. ఇంతవరకు ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగానే పావులు కదుపుతుంది. ఇక తాజాగా మునిసిపల్ ఎన్నికలను ఉద్దేశించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

సీఎం కేసీఆర్ నే అని చెప్పిన కేటీఆర్
రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ క్యాడర్ మధ్యనే తీవ్ర పోటీ ఉందని, ఇండిపెండెంట్లుగా బరిలో ఉండొద్దని బ్రతిమాలుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. అంతే కాదు సీఎం పదవిపై స్పందించిన ఆయన కేసీఆరే తమ సీఎం అని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ స్పష్టత ఇచ్చాక అనవసరంగా మళ్ళీ ఎందుకీ చర్చ అన్నారు. అసలు ఆ అనుమానమెందుకని ప్రశ్నించారు. తమకు శాశ్వత శత్రువులు, రాజకీయ శత్రువులు లేరని తేల్చిచెప్పారు కేటీఆర్ .

ఎంఐఎంతో స్నేహం చేస్తే హిందువులకు వ్యతిరేకమా అని ప్రశ్న
అదే సమయంలో సికింద్రాబాద్ను పట్టించుకోవటం లేదనేది సరైంది కాదన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఓల్డ్ సిటీలో మెట్రో కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుందని అంత మాత్రాన.. హిందువులకు వ్యతిరేకం కామని చెప్పారు. కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఉన్నాడా అని ప్రశ్నించిన కేటీఆర్ రాజకీయ పార్టీల విషయంలో కూడా తనదైన శైలిలో స్పందించారు.

మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి .. బీజేపీకి సీన్ లేదన్న కేటీఆర్
ఇక మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తీసిపారేయడానికి వీల్లేదని అన్నారు.ఎంతో చరిత్ర ఉన్న, ఎన్నో ఒడిదుడుకులు చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు . ఒకటి, రెండు విజయాలు రాగానే తామేమీ ఎగిరిపడటం లేదన్న కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తన అభిప్రాయం చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదన్న విషయం వాళ్లకూ తెలుసని వ్యాఖ్యానించారు. నా చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే వుందని సెటైర్ వేశారు.

ఉత్తమ్ రాజీనామా పార్టీ వ్యవహారం ..
టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకుంటారన్న వార్తలపై స్పందించిన ఆయన అది వాళ్ల పార్టీ వ్యవహారమని చెప్పారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన ర్యాలీకి పోలీసుల అనుమతి లభించకపోవడాన్ని ప్రస్తావిస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకే పర్మిషన్ ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications