సోనియా, రాహుల్ సారథ్యంపై రేవంత్, భట్టి సంచలనం: గాంధీ కుటుంబం త్యాగం: వేర్వేరు లేఖలతో
హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యున్నత విభాగం వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోన్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి వేర్వేరుగా ఈ లేఖలను రాశారు. సోనియాగాంధీకి పంపించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియా గాంధీ తప్పుకోబోతోన్నారంటూ వార్తలు వస్తుండటం, అదే సమయంలో కొత్త నేతను ఎన్నుకోవడానికి సీడబ్ల్యూసీ భేటీ కావడం వంటి పరిణామాల మధ్య వారు లేఖలు రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముందుచూపు గల నేతగా..
సోనియా గాంధీ సారథ్యంలో పని చేయడానికి తాము సదా సిద్ధంగా ఉన్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ వంటి శక్తిమంతురాలైన నాయకత్వం అవసరం ఉందని పేర్కొన్నారు. 2004 నుంచి 2009 మధ్యకాలంలో రాహుల్ గాంధీ సారథ్యంలో దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుందనే విషయాన్ని గుర్తు చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే కాంగ్రెస్కు సరైన మార్గదర్శకం చేయగలరని పేర్కొన్నారు.

వ్యతిరేకంగా లేఖ రాయడం..
పార్టీ అధిష్ఠానానికి 23 మంది సీనియర్ నేతలు వ్యతిరేకంగా లేఖ రాయడం సరైన చర్య కాదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ పురోగమించడానికి వారు తమ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను చేయడం అభినందించదగ్గదే అయినప్పటికీ.. దాన్ని బహిర్గతం చేయడం అభ్యంతరకరమని అన్నారు. సీనియర్ నేతల అభిప్రాయాలను పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వంలో పదవులను అనుభవించిన వారూ..
2004-2014 మధ్యకాలంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో భాగస్వామ్యులైన సీనియర్లు కూడా లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని భట్టి తెలిపారు. ప్రభుత్వంలో తాము భాగస్వామ్యులుగా ఉన్నామనే విషయాన్ని వారు విస్మరించినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను బహిర్గతం చేయడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది పార్టీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.

రాహుల్ ది బెస్ట్..
సోనియాగాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వస్తే..ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీకి మాత్రమే పార్టీ పగ్గాలను అప్పగించాల్సి ఉంటుందని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొన గల నేతగా రాహుల్ గాంధీ గురించి అభివర్ణించారు. మోడీ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిరుద్యోగం, రైతుల సమస్యలు, పెద్ద నోట్ల రద్దు, అస్తవ్యస్తంగా అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకల గురించి దేశానికి తెలియజేశారని చెప్పారు.

గాంధీ కుటుంబ త్యాగం..
యూపీఏ ఛైర్ పర్సన్గా సోనియా గాంధీ, ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో అనేక సంస్కరణలను అప్పటి ప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, పేదలకు ఉచిత, నిర్బంధ విద్య వంటి అనేక పథకాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని, వాటిని ప్రజలు విస్మరించబోరని అన్నారు.












Click it and Unblock the Notifications