జానారెడ్డి కస్సు బుస్సు: పీఏసీ మీటింగ్కు వచ్చి.. వెంటనే వెళ్లిన నేత
హుజురాబాద్ ఉప పోరు ముగిసింది. ఈటల రాజేందర్ జయకేతనం ఎగరవేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ పత్తాలేకుండా పోయారు. ఓటమి తర్వాత పరిస్థితులపై సమీక్ష చేయడం కామనే.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రివ్యూ చేసింది. ఆ సమావేశానికి సీనియర్ నేత జానారెడ్డి హాజరయ్యారు. ఆ వెంటనే వెళ్లిపోయారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, పార్టీ పరిస్థితిపై చర్చించడానికి గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఊహించినట్లుగానే సమావేశం వాడీవేడిగా జరిగింది. సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. వెళ్తూ కామెంట్లు చేశారు. ప్రతిసారి సమావేశానికి తానిక రానని, తన అవసరం ఉన్నప్పుడే వస్తానని పేర్కొన్నారు. తాను ఈ సమావేశానికి హాజరుకాకపోతే, తాను రాలేదని అంటారని, ఆ మాట పడకూడదనే వచ్చి వెళ్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ మావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తానని నిన్న జగ్గారెడ్డి వివరించారు. అయినప్పటికీ ఆయన కూడా రాలేదు.
హుజురాబాద్ ఎన్నిక ఓటమికి తనే బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఫలితంపై ఇంచార్జీ ఠాగూర్ కూడా ఆరా తీశారు. ఈ క్రమంలోనే మీటింగ్ జరిగింది. దానికి హాజరైన జానారెడ్డి.. కస్సు బస్సు మంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. పార్టీలో ఎప్పుడూ ఏదో అంశంపై డిస్కష్ చేసే పెద్దాయన.. ఈ సారి ఇలా మీటింగ్కు వచ్చి వెంటనే అక్కడినుంచి జారుకున్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. తమలో ఒకరికి పదవీ ఇవ్వాలని అడిగారు. కానీ హై కమాండ్ ఒప్పుకోకపోవడంతో అంటిముట్టనట్టుగానే ఉన్నారు. బై పోల్లో ఓటమి తర్వాత వారికి మరింత సమయం వచ్చింది. అందుకే విమర్శలు చేస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉన్నారు. ఆయన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.