ఎవరూ ముందుకురాలేదు: కరోనాతో మృతి, జేసీబీతో వ్యక్తి మృతదేహం తరలింపు
యాదాద్రిభువనగిరి: కరోనా మహమ్మారి కారణంగా సమాజంలో మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రోగాన్ని దూరం పెట్టాలని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. కొందరు ప్రజలు మాత్రం రోగులను కూడా దూరం చేస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. దీంతో వారు మానసికంగా కుంగిపోయి మహమ్మారికి బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక, కరోనాతో మృతి చెందినవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సొంత కుటుంబసభ్యులు, బంధువులే రోగుల అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది లేదా వైద్య సిబ్బందే వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా, యాదాద్రిభువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని జేసీలో తరలించారు.
వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన 49ఏళ్ల ఓ వ్యక్తి కరోనా బారినపడ్డాడు. హోంఐసోలేషన్లోనే ఉంటూ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అయితే, అతడు కరోనా కారణంగా మృతి చెందిన కారణంగా బంధువుల, గ్రామస్తులు కూడా అతని అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు.
ఈ క్రమంలో చేసేదేంలేక అతని కుటుంబసభ్యులే పీపీఈ కిట్లు ధరించి జేసీబీలో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో 2574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2927 మంది కోలుకున్నారు. 9 మంది మరణించారు.
తెలంగాణ వ్యాప్తంగా 1,40,969 మంది కరోనా బారినపడ్డారు. 32,553 యాక్టివ్ కేసులున్నాయి. 1,07,530 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 886 మంది కరోనాతో మరణించారు.