కరోనాతో ఏ ఇతర శరీర అవయవాలకు ముప్పు ఏర్పడుతుంది..? వైద్యులు ఏం చెబుతున్నారు?
హైదరాబాదు: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ హెచ్చుమీరుతున్నా, డెత్ రేట్ తక్కువ ఉండటంతో దేశవ్యాప్తంగా జనాలు రిలాక్స్ అయ్యారు. ఇక, ఇప్పటివరకూ ఊపిరితిత్తులపై మాత్రమే కరోనా ప్రభావం చూపుతుందని భావించారు. కానీ, కోవిడ్ -19 చాపకింద నీరులా మొత్తం శరీరాన్ని కబళిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Recommended Video
ఇతర అవయవాలపై కూడా కరోనా పంజా
వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్న కరోనా ఊపిరితిత్తుల్లోనే వ్యాప్తిచెందుతోందని, కాబట్టి, వాటికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని నిన్నమొన్నటి వరకూ అనుకున్నారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం, మరిన్ని చేదు నిజాలు బయటకు వచ్చాయి. కరోనా , శ్వాస వ్యవస్థపై మాత్రమే కాదు, శరీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి లక్షల మంది జనాలు మృత్యువాత పడ్డారు. కోవిడ్ 19 మానవ శరీరంలో ఓ భాగాన్ని విడిచిపెట్టడంలేదని, స్లో పాయిజన్లా అన్ని అవయవాలనూ దెబ్బతీస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, రక్తం, మెదడు, కండరాలు ఇలా ప్రతి అణువునూ వైరస్ కబళిస్తోంది..
లక్షణాలు కనిపించని కరోనా పేషెంట్లలో గుండెపోటు
శరీరంలోని వివిధ అవయవాలపై కరోనా ప్రభావం రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సార్లు ప్రత్యక్షంగానూ, కొన్ని సార్లు పరోక్షంగా కోవిడ్ 19 క్రమంగా మనిషి శరీరాన్ని కబళిస్తోందట. ముఖ్యంగా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఛాతి నొప్పి వంటి సమస్యలను గుర్తించామని వైద్యులు తెలిపారు. కరోనా ప్రభావంతో రక్తం గడ్డ కట్టుకుపోయే సమస్యలను చాలా కేసుల్లో గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. దాంతో ఇతర అవయవాలకు రక్త సరఫరా తగ్గి గుండె పనితీరుతో పాటూ ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయి. కొందరిలో పక్షవాతం, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలుస్తోంది. అయితే కరోనా ప్రభావం ఒక్కొక్కరి పై ఒక్కో రకంగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు..
కరోనా నుంచి బయటపడాలంటే...
వాస్తవానికి శరీరంలోని ఒక అవయవం పై కరోనా ప్రభావం మొదలైతే అది క్రమంగా ఇతర అవయవాలపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగితే.. వాటిలో నీటి శాతం పెరుగుతోంది.. దాంతో గుండెపై ఒత్తిడి పెరిగి క్రమంగా రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి, కరోనా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అవయవాలన్ని దెబ్బతింటున్నాయి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కరోనా నుంచి బయటపడాలంటే జాగ్రత్తగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరగకపోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన వారవుతారని వైద్యులు చెబుతున్నారు.