కరోనా విలయం: కొరటాల శివ ఆగ్రహం - మనిషికి, పశువులకు తేడా ఉండదు..
భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ తన విలయతాండవాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప్డవాళ్ల సంఖ్య 1.5కోట్లకు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6లక్షలు దాటేసింది. మనదేశంలో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 37,148 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం 11.7లక్షల మందికి వైరస్ సోకగా, అందులో చనిపోయినవాళ్ల సంఖ్య 30వేలకు చేరువైంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ తోపాటు ఏపీ అధికారిక కేంద్రాలైన కృష్ణా, గుంటూరులోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది.
వైరస్ వ్యాప్తి పట్ల ఇప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అలాంటివాళ్లపై టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం (ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం'' అని శివ తనదైన శైలిలో హెచ్చరించారు.
ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ?
తన సినిమాల్లోనూ సామాజిక బాధ్యతల్ని గుర్తుచేసే కొరటాల శివ.. కొద్ది రోజుల కిందట కూడా ఇదే తరహాలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్లలో చాలా మంది ఆ విషయాన్ని దాచి పెడుతూ, వ్యాప్తికి కారణమవుతున్నారనే రిపోర్టుల నేపథ్యంలో అలాంటి వైఖరి సరికాదని, వైరస్ సోకినట్లు గుర్తించిన వెంటనే కనీసం ఇంట్లోవాళ్లకైనా చెప్పి భౌతిక దూరాన్ని పాటించాలని, తద్వారా అందరికీ మేలు చేసినట్లవుతుందని ఆయన సూచించారు. శివ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.