కీచక రాజు పరారీలోనే.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్
కీచకుడు రాజు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆ నీచుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే చిన్నారిపై హత్యాచారం ఘటనలో తాను మొదట చేసిన ట్వీట్ పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు పొరబాటున ట్వీట్ చేశానని వివరించారు. ఆ ట్వీట్ ను తొలగిస్తున్నట్టు ఓ ప్రకటన చేశారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడి విషయంలో తనకు తప్పుడు సమాచారం అందిందని వెల్లడించారు.
నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని, అతడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిందితుడ్ని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని, తద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు రాజు ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతను స్మార్ట్ ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం కష్టంగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు రాజును ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు.
ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి రాజు మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు. గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications