ఏపీ, తెలంగాణ చిచ్చు..! పట్టు సడలిందా డాటా చోరీ కేసు?
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చిచ్చు రేగుతూనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక అంశంలో రెండింటి మధ్య వివాదం రాజుకుంటోంది. వివాదస్పద అంశాల్లో పైచేయి సాధించే విధంగా
టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. అయితే పలు వివాదాలు అలా వేడెక్కుతున్నాయో లేదో ఇలా చల్లారిపోతున్నాయి కూడా. ఇటీవల జరిగిన డాటా చోరీ కేసు కూడా రెండు రాష్ట్రాల మధ్య దుమారం రేపినా.. ప్రస్తుతం సద్దుమణిగినట్లు కనిపించడం చర్చానీయాంశమైంది.

ఏమైంది డాటా చోరీ కేసు?
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన నాటి నుంచి మొదలు ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత లేదనే చెప్పాలి. అక్కడ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ మధ్య పరిస్థితులు ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇక మొన్నటి ముందస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది టీఆర్ఎస్. ఆ క్రమంలో తెరపైకి వచ్చిన డాటా చోరీ కేసును అస్త్రంగా మలచుకోవాలని భావించింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఢీ కొట్టింది.

ఎన్నికల తంతు అడ్డంకా?
రెండు రాష్ట్రాల మధ్య డాటా చోరీ కేసు పెద్ద దుమారమే రాజేసింది. నువ్వెంతంటే నువ్వెంతనే రేంజ్ లో వ్యవహారం పీక్ స్టేజీకి వెళ్లింది. అయితే అంత పెద్దగా ముదిరిన వ్యవహారం ఇప్పుడు సద్దుమణిగినట్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. ఇరు రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా సిట్ లు ఏర్పాటు చేసుకున్నా కూడా దర్యాప్తు నిలిచిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హైదరాబాద్ లో లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్స్ అనే సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అదలావుంటే తమ డాటానే చోరీ అయిందంటూ టీడీపీ ప్రభుత్వం ఏపీలో రెండు సిట్ లు ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే కేసు ఫైల్ అయిన మొదట్లో రెండు రాష్ట్రాల సిట్ లు వేగంగానే దర్యాప్తు మొదలుపెట్టాయి. అంతలోనే లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రావడంతో కాస్తా వెనక్కి తగ్గాయి.

అటకెక్కేనా?.. పురోగతి సాధించేనా?
ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. దర్యాప్తులో వెలుగుచూసే ఏ చిన్న అంశమైనా రాజకీయ దుమారం రేపే అవకాశముంది. అందుకే కొంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్నాయి ఇరు రాష్ట్రాల సిట్ బృందాలు. అయితే న్యాయపరమైన ప్రక్రియ మాత్రం కొనసాగిస్తూనే మిగతా అంశాలను పక్కనపెట్టడం గమనార్హం.
ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ ఏపీలో తలదాచుకుంటున్నట్లు తెలంగాణ సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల సమయాన అతడిని అరెస్ట్ చేయడానికి ఏపీకి వెళితే రాజకీయ రంగు పులుముకోవచ్చనేది ఓ వాదన. ఆ క్రమంలో ఎన్నికల తంతు అంటే ఏప్రిల్ 11వ తేదీ వరకు డాటా చోరీ కేసులో ఎలాంటి పురోగతి ఉండకపోవచ్చేమో.












Click it and Unblock the Notifications