కార్తీక శోభ: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యస్నానాలు ఆచరించి పూజలు
ఇవాళ కార్తీక పౌర్ణమి. అతివలు నెలరోజులపాటు భక్తి శ్రద్ధలతో ఆ ఆది దంపతులను నిష్టగా కొలిచారు. నేడు తులసీ పూజ చేసి.. ఇష్ట దైవాన్ని కొలుస్తారు. సాయంత్రం దీపాలు వెలిగించి మన:పూర్వకంగా పూజిస్తారు. శ్రావణ మాసంతోపాటు కార్తీక మాసంలో పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ఇటు కార్తీక పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. శైవ క్షేత్రాలు హరనామస్మరణతో మారుమోగుతున్నాయి.
Recommended Video
దీపాలు వెలిగించి..
ఇవాళ వేకువజామున ఆలయాలకు భక్తులు చేరుకున్నారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు కూడా చేస్తున్నారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలకు మరింత శోభ వచ్చింది. భద్రాచలం గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తలరివస్తున్నారు.
భక్తుల రద్దీ..
కార్తీక పౌర్ణమి, మూడో సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వదులుతున్నారు. గోదావరి చెంతనే ఉన్న భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. ఇటు వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో కూడా భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.
పుణ్యస్నానాలు
ఇటు ఏపీలోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శైవలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. సముద్ర తీరాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్ని శివాలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలానికి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.