ఎముక ఎముక స్కాన్, 5.15 గంటలపాటు ప్రక్రియ, దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
దిశ నిందితులు మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం ముగిసింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని బృందం రీ పోస్టుమార్టం నిర్వహించింది. రీ పోస్టుమార్టం కన్నా ముందే ఎక్స్ రే తీశారు. రీ పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు వైద్యుల బృందం అందజేయనుంది.
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం, అవసరం లేదన్న ఏజీ, చేయాల్సిందేనంటోన్న హైకోర్టు
రీ పోస్టుమార్టం
దిశ నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యులు రీ పోస్టుమార్టం చేయొద్దని షరతు విధించడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం ప్రక్రియ మధ్యాహ్నాం 3.15 గంటలకు ముగిసింది.
స్కాన్, ఎక్స్ రే
రీ పోస్టుమార్టం కన్నా ముందే నిందితుల ప్రతీ బోన్ను స్కాన్ చేశారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. స్కానర్లు కావాలని అడగడంతో అందజేశామని చెప్పారు. నిందితుల బంధువులు మృతదేహాలను గుర్తుపట్టిన తర్వాతే రీ పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టారని పేర్కొన్నారు. కుటుంబసభ్యుల సంతకాలు తీసుకొని వారికి మృతదేహాలను అందజేశామని శ్రవణ్ తెలిపారు. రెండు అంబులెన్సులలో నిందితుల స్వగ్రామాలకు మృతదేహాలను తరలించారు. వారి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
హైకోర్టు జోక్యంతో
గతనెల 28వ తేదీన వెటర్నరీ వైద్యురాలు దిశపై నలుగురు నిందితులు లైంగికదాడి చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తర్వాత నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకొని ఈ నెల 6వ తేదీన చటాన్ పల్లి వద్ద సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అదేరోజు పంచానామా చేసి, మహబూబ్ నగర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ లోపు జాతీయ మానవ హక్కుల కమిషన్, హైకోర్టు జోక్యం చేసుకోవడంతో నిందితుల అంత్యక్రియలు వాయిదాపడింది. పాలమూరు ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఎయిమ్స్ వైద్యులు
సుప్రీంకోర్టు కమిటీ వేయడం, ఈ నెల 17వ తేదీన మృతదేహాలకు సంబంధించి నిర్ణయం హైకోర్టునే తీసుకోమని చెప్పడంతో.. రీ పోస్టుమార్టం నిర్వహించమని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిమ్స్కు చెందిన వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించబోతున్నారు. దానిని బట్టి హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీచేసే అవకాశం ఉంది. మరోవైపు మృతదేహాలకు అంత్యక్రియల కోసం గుడిగండ్లలో ఏర్పాటు కూడా చేశారు.
కమిటీతో విచారణ
దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించనుంది. ఆరునెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కమిటీకి పూర్తి సహాయ, సహాకారాలు అందజేయాలని కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంచేసింది.