పవన్పై రెక్కీ జరగలే, మద్యం మత్తులోనే గొడవ: పోలీసుల వివరణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ జరిగిందని దుమారం రేపింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపారు. అసలు పవన్ ఇంటి ముందు రెక్కీ జరగలేదని నిర్ధారించారు. ఆ ముగ్గురు యువకులు తాగి రచ్చ చేశారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ప్రాణాలకు థ్రెట్ లేదని వివరించారు. తాగి వీరంగం చేయడంతో.. రెక్కీ అనుకున్నారని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే..?
పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని ఆ ముగ్గురు యువకులు ఒప్పుకున్నారు. మద్యం మత్తులో గొడవ చేశామని అంగీకరించారు. ఆదిత్య, వినోద్, సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పబ్కు వెళ్లి.. తిరిగి వస్తుండగా గొడవ జరిగింది. అయితే కారు ఆపి.. గొడవ చేయడంతో రెక్కీ జరిగిందని అనుకున్నారు.
కుట్ర జరగలే
పవన్ కల్యాణ్పై దాడికి కూడా కుట్ర కూడా జరగలేదని పోలీసులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నివేదికను తెలంగాణ పోలీసు శాఖ శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్ 31వ తేదీన రాత్రి ఆదిత్య, సాయికృష్ణ, వినోద్.. పవన్ ఇంటి వద్ద బౌన్సర్లతో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఫిర్యాదు చేయడంతో విచారణ
గత నెల 31వ తేదీ రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు... గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, ఆ సమయంలో తమ కారును అక్కడి నుంచి తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని యువకులు తెలిపారు. సదరు యువకులకు నోటీసులు జారీ చేసిన పంపించి వేసినట్లు తెలిపారు. రెక్కీ గానీ, పవన్పై దాడికి కుట్ర గానీ జరగలేదని తెలిపారు.