తప్పుడు ప్రచారం చేయొద్దు: డ్రైవర్ ఆత్మహత్యపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ ఆత్మహత్య ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. రాజయ్య అభ్యర్థన మేరకే మూడు నెలల క్రితం జేబీఎస్కు బదిలీ చేశామని తెలిపారు. జేబీఎస్లో డ్యూటీ మార్చాలని ఆయన ఎప్పుడు అధికారులను కోరలేదన్నారు.
వ్యక్తిగత కారణాలతోనే గోదావరిఖనిలోని తన ఇంట్లో డ్రైవర్ రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని సజ్జనార్ చెప్పారు. అయినా డ్రైవర్ రాజయ్య అంత్యక్రియల కోసం ఆర్టీసీ తరపున రూ. 20 వేలు గోదావరిఖని డిపో మేనేజర్ స్వయంగా వెళ్లి అందజేసినట్లు తెలిపారు.
రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు కారణమని ఆయన కుటుంబసభ్యుల నుంచి కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి సంస్థ నిబంద్ధతతో పనిచేస్తోందన్నారు. ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీసేలా ఏకపక్షంగా వార్తులు ప్రచురించడం సరికాదన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తెలియజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోలీసు అధికారులను కోరారు.
గ్రేటర్ పరిధిలో మరో వెయ్యికిపైగా బస్సలు
గ్రేటర్ పరిధిలో కొత్తగా వెయ్యికిపైగా సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఎనిమిదేళ్లుగా జిల్లాల్లో తిరుగుతున్న 700 వరకు సూపర్ లగ్జరీలను నగరానికి తెచ్చి..వాటిని సిటీ బస్సులుగా మార్పులు చేయబోతున్నారు. సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో నగరానికి కొత్తగా బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సిటీలో సరికొత్తగా 320 వరకు విద్యుత్ బస్సులను కూడా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులన్నీ ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావచ్చినట్లు చెప్పారు. రెండు నెలల్లో నూతన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కొత్తగా 1016 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిని ఆర్టీసీ సొంత డబ్బులతో కొనుగోలు చేస్తుందన్నారు. ఇక, నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన 700 బస్సులను తుక్కు కింద మార్చబోతున్నట్లు వివరించారు.