హైదరాబాద్లో రూ. 80 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ సీజ్: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ ఎత్తున డగ్ర్స్ పట్టుబడటం కలకలం రేపింది. నగర శివారులో సుమారు రూ. 80 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు.
రూ. 28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్, రూ. 3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్ను సీజ్ చేశారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రిన్ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ముడిసరుకు విలువ రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత మూడు రోజులుగా హైదరాబాద్ తోపాటు ముంబైలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ. 45 లక్షల విలువైన భారత కరెన్సీ, యూఎస్ డాలర్లు, ఈయూఆర్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
దేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను సరాఫరా చేసేందుకు డ్రగ్ మాఫియా వేసిన ప్లాన్ను అధికారులు రట్టు చేయినట్లయింది. గతంలో డ్రగ్స్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో పోలీసులు, డీఆర్ఐ అధికారులు డ్రగ్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ముంబైలో సుమారు వెయ్యి కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.