రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనపై అప్డేట్
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. మరిన్నీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోంది.

మరిన్ని వర్షాలు..
హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ అయింది. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఎవరూ తమ ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇవ్వాళ, రేపు భారీ వర్షాలు పడొచ్చంటూ వాతావరణ కేంద్రం అధికారులు ఇచ్చిన సమాచారంతో అటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తలను తీసుకుంటోంది.

పర్యటన రద్దు..
ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ- ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ను సందర్శించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5.30 గంటలకు ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా ఈ పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

భారీ వర్షాల వల్ల
రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం, ఇవ్వాళ రేపు కూడా వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ద్రౌపది ముర్ము పర్యటన రద్దయినట్లు పేర్కొన్నారు. ఈ సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలకడానికి బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆమెకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఖత్రియా హోటల్ వరకు ర్యాలీగా తరలి వెళ్లాలని భావించారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్యేలు టీ రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.

యశ్వంత్ సిన్హాకు ధీటుగా..
భారీ వర్షాల వల్ల దీన్ని రద్దు చేయాల్సి వచ్చిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఇటీవలే యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాల తొలి రోజే ఆయన హైదరాబాద్కు వచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. భారీ ర్యాలీని నిర్వహించారు. దీనికి ధీటుగా ద్రౌపది ముర్ము స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నాయకులు భావించినప్పటికీ.. వాతావరణం అనుకూలించలేదు.

తెలుగు రాష్ట్రాలు ఇలా..
ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, యూపీఏ తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమతి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్థి వైపే మొగ్గు చూపింది.












Click it and Unblock the Notifications