ముందస్తు లేదు, షెడ్యూల్ ప్రకారమే, సిట్టింగులకే టికెట్లు, జనంతో మమేకం కావాలి: కేసీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదే సమయం ఉండటంతో అంతా నియోజకర్గ కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టంచేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో విసృతస్థాయి సమావేశం జరిగింది. కీలక అంశాలు చర్చించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఎమ్మెల్యేలను మార్చాం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ హింట్ ఇచ్చారు. పాత వారికే టికెట్లు ఇస్తామన్న కేసీఆర్.. ఎన్నికలకు పది నెలల సమయమే ఉందని, పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కోరారు.ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో మాట్లాడాలని.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేసీఆర్ సూచించారు. సర్వేలు అన్ని టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా పని చేయాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. లబ్దిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలని తేల్చిచెప్పారు.

ఆత్మీయ సమ్మేళనాలు
ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలని తెలిపారు. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తల బలంతో ఓటర్లందరినీ చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని కేసీఆర్ కోరారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వివరించారు. ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తన పని తాను చేస్తోందని తెలిపారు.

రెగ్యులర్
ఇటు రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. 2016 ఫిబ్రవరి 26న 16వ నెంబర్ జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. జీవోపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థి ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసు విచారించిన సుప్రీంకోర్టు కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన తీర్పు ఇచ్చింది. కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశించారు.












Click it and Unblock the Notifications