రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్.. వారిని ఎన్ కౌంటర్ చేయండి, సీఎం కేసీఆర్కు సజెషన్
విశ్వనగరి భాగ్యనగరంలో డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కాస్ట్లీ ఏరియాలో.. ఉన్నత కుటుంబాలే కాదు.. మధ్య తరగతి యువత కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారు. అయితే పబ్బులలో కూడా డ్రగ్స్ గబ్బు రేపుతున్నాయి. బంజారాహిల్స్లో గల రాడిసన్ బ్లూ హోటల్పై అర్ధ రాత్రి పోలీసులు రైడ్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వీరిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. ఘటనపై బీజేపీ నేత రాజాసింగ్ స్పందించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పబ్బులలో డ్రగ్స్ గబ్బు..
హైటెక్ సిటీలో డ్రగ్స్ అక్రమ రవాణా, పబ్లలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పలు పబ్బులపై దాడి చేశారు. వాటిని సీజ్ కూడా చేశారు. తెల్లవారుజామున వరకు పబ్బులలో పార్టీలు జరుగుతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బంజారాహిల్స్లో గల రాడిసన్ బ్లూ హోటల్పై అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ వినియోగించారనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు, వారి కుమారులు ఉన్నారు.
ఎన్ కౌంటర్ చేయండి..
సిటీ మరింత డెవలప్ అవుతున్న క్రమంలో ఈ డ్రగ్స్ గబ్బు దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఇందుకోసం సీఎం కేసీఆర్కు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. డ్రగ్స్ కేసు అంటూ పోలీసులు మళ్లీ రావడం మొదలుపెట్టారని, రెండు రోజులు హడావిడి చేసి మళ్లీ కేసును పక్కన పడేస్తారని విమర్శించారు. తెలంగాణలో డ్రగ్స్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి ? ఈ విషయం పోలీసులకు తెలవదా..? అని ప్రశ్నించారు.
పోలీసులకు అన్నీ తెలుసు
పోలీసులకు ఏ మూలన ఏం జరుగుతుందో అన్నీ తెలుసని, కానీ కొద్ది రోజులు షో చేసి వదిలేస్తారని మండిపడ్డారు. తెలంగాణ యువకులు ఏమైనా సీఎం కేసీఆర్కి అవసరం లేదని, నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి మూలాలను కనిపెట్టాల్సిందిగా సూచించారు. డ్రగ్స్ కొనుగోలు చేసే వారిని, అమ్మేవారిని ఎలాంటి శిక్ష అయినా వేయాలని సూచించారు. అవసరం అనుకుంటే డ్రగ్స్ అమ్మే వారిని ఎన్ కౌంటర్ చేయాలని రాజాసింగ్ హితవు పలికారు. దీంతో మిగతా వారు భయపడుతారని.. డ్రగ్స్ విక్రయాలు జరగవని చెప్పారు.