కేసీఆర్ అహంకారం వంచుతాం: ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్ అహంకారాన్ని అంతం చేసే ప్రజాతీర్పు హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ రానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే ఈ ఎన్నికలో గెలుపు ముమ్మాటికీ బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికలకు ఇది ట్రయల్స్ కాబోతున్నదని అన్నారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే ప్రధాన చర్చ సాగింది.
దేశంలో బీజేపీ బలమైన శక్తి అని, రాహుల్, మమత లాంటి వాళ్లే బీజేపీ ముందు తల వంచారని చెప్పారు. హుజూరాబాద్ బైపోల్లో ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఈటల రాజేందర్ అనుకొని పని చేస్తే టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్ అన్నింటినీ వదులుకున్నారని చెప్పారు. కేసీఆర్ అహంకారాన్ని మనందరం కలిసి అణిచివేసే అవకాశం హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని బీజేపీ నేతలకు తరుణ్ చుగ్ సూచించారు.
ఈ ఎన్నికలో బీజేపీని గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. చరిత్ర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలని, సత్యంతో దేన్నయినా సాధించవచ్చన్నారు. రైతులు, యువకులు, ఉద్యోగులను ఇలా అన్ని వర్గాల వారిని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే ఎన్నిక హుజూరాబాద్ బైపోల్ అని అన్నారు.
సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి అరిష్టమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 50 రోజులుగా హుజూరాబాద్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజలను కలుస్తూ వారి మద్దతు పొందుతానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహాయ, సహకారాలతో భారీ మెజార్టీతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక్షస పాలన నుంచి హుజూరాబాద్ ప్రజలను కాపాడుకుంటానన్నారు. ఈ ఎన్నికలో కేసీఆర్ ఎన్ని అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నించినా చివరకు అంతిమ విజయం తనదేనని చెప్పారు.