పరీక్షలంటే భయం..! వత్తిడితో మరణాలు.. నీరదారెడ్డి సిఫార్సులు అటకెక్కేనా?
హైదరాబాద్ : ర్యాంకులే చదువుకు కొలమానమా? ర్యాంకులొస్తేనే చదువులో రాణించినట్లా? ర్యాంకులే భవిష్యత్తుకు గీటురాయా? ర్యాంకుల కోసం పరితపించే తల్లిదండ్రుల నుంచి.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమే. ర్యాంకులు, మార్కుల మధ్య విద్యార్ధులు నలిగిపోతున్నారు. డిప్రెషన్ కు లోనయి కొందరు సహజంగా మరణిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు.

పరీక్షల భయం..!
చదువుల పోటీ ప్రపంచంలో విద్యార్థులు వత్తిడికి గురువుతున్నారు. ర్యాంకులు, మార్కులు విద్యార్థులను డిప్రెషన్ కు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈనెల 2న సికింద్రాబాద్ లో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థి గోపిరాజు గుండెపోటుతో మరణించగా.. శనివారం (09.03.2019) నాడు కడప జిల్లా మైదుకూరులో ఇంటర్ విద్యార్థి సుజన ఎగ్జామ్ హాల్ లో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే చనిపోయింది.
2017-18 విద్యా సంవత్సరంలో 150 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అందులో హైదరాబాద్ లోనే దాదాపు 30 మంది సూసైడ్ చేసుకున్నారు.

కార్పొ'రేట్'.. వత్తిడి కూడా ఎక్కువే
కార్పొరేట్ కాలేజీల్లో డిప్రెషన్ కు గురవుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అటు తల్లిదండ్రుల ర్యాంకుల పిచ్చితో పాటు ఇటు కాలేజీ అధ్యాపకుల వత్తిడిని పిల్లలు భరించలేకపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా ( 5AM - 10PM) చదువుల పేరిట రాచి రంపాన పెడుతున్నారు. ఇక యావరేజ్ స్టూడెంట్ల పరిస్థితి మరీ దారుణం. వారికి మరికొన్ని గంటల స్పెషల్ క్లాసులు తప్పడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్న పరిస్థితి.
పరీక్షల సమయంలో కొందరు, ఫలితాలు వచ్చాక మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి.
హైస్కూల్ నుంచి ఐఐటీ విద్యార్థుల వరకు ఈ లిస్టులో ఉంటున్నారు. ఐఐటీ, మెడికల్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నవారు సైతం ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతున్నట్లు తెలుస్తోంది.

నీరదారెడ్డి సిఫార్సులు ఏమైనట్లో?
విద్యార్థులు డిప్రెషన్ కు గురికాకుండా తద్వారా ఆత్మహత్యలు నివారించడానికి డాక్టర్ నీరదారెడ్డి కమిషన్ చేసిన సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన 17 సిఫార్సులను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జూనియర్ కాలేజీల్లో సైకాలజిస్టుల నియామకం, స్టడీ అవర్స్ తగ్గించడం కమిషన్ సిఫార్సుల్లో ముఖ్యమైనవి.
మరోవైపు 2017 లోనే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో తప్పనిసరిగా సైకాలజిస్టులను నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. కానీ నేటికి అది ఆచరణ సాధ్యం కావడం లేదు. చాలా కాలేజీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి.

సైకాలజీ సేవలు.. ఫోన్ చేస్తే చాలు సాయం
చదువుల ప్రపంచంలో పోటీపడుతూ అలసిపోతున్నారు విద్యార్థులు. అయితే మానసిక సంఘర్షణకు గురైనప్పుడు తమకు కాల్ చేస్తే సరైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. అందులోభాగంగా సీబీఎస్ఈ బోర్డు 1800118004 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎవరైనా ఫోన్ చేయవచ్చు. రోష్ని అనే స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్ లో చైల్డ్ గైడెన్స్ క్లినిక్ నిర్వహిస్తోంది. 040-66661117 / 66661118 నంబర్ల ద్వారా సైకాలజిస్టుల సలహాలు తీసుకోవచ్చు. చైల్డ్ లైన్ 1098 కు కూడా ఫోన్ చేయవచ్చు.

ఇలా చేయండి.. వత్తిడి మటుమాయం
ముఖ్యంగా పరీక్షల సమయంలో మరింత వత్తిడికి గురవుతున్నారు విద్యార్థులు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వత్తిడిని జయించవచ్చు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత టెన్షన్ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ టెన్షన్ కు గురవుతున్నట్లు అనిపిస్తే.. 5 నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం ఉత్తమం.
పరీక్షల సమయంలో పొద్దంతా పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు కనీసం 15 నిమిషాలైనా యోగా లేదా ధ్యానం చేయడం బెటర్. తద్వారా మనసు చాలా తేలికవుతుంది. పరీక్షల సమయంలో చాలామంది రాత్రంతా మెలకువతో ఉండి చదువుతుంటారు. అది సరికాదు. సరిపడా నిద్రపోతేనే మరునాడు పరీక్ష సరిగా రాయగలుగుతారు. ఇక పోషకహారం తప్పనిసరిగా తీసుకోవాలి. భోజనంతో పాటు పాలు, పండ్లు, గుడ్లు తీసుకుంటే చాలా బెటర్. కొద్దిపాటి చిట్కాలతో వత్తిడిని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. టెన్షన్ పడకండి. పద్దతి ప్రకారం చదవండి. పరీక్షల్లో విజయం మీదే. ఆల్ ది బెస్ట్.












Click it and Unblock the Notifications