Omicron:తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు, ఒక్క కేసు రాలే: డీహెచ్
ఒమిక్రాన్ టెన్షన్ మాత్రం అందరికీ పట్టుకుంది. ఇప్పటివరకు దేశంలో 5 కేసులను వైద్యారోగ్య శాఖ నిర్ధారించింది. అయితే చాలా చోట్ల కేసులు వచ్చాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు కూడా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్నారు. టిమ్స్ ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్ధితి కుదుట పడుతోందని వివరించారు. మొదటి వేవ్లో హాస్పటల్లో చేరి చాలా మంది భయంతో ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు.
Recommended Video

కేసులు లేవు..
అయితే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఒమిక్రాన్ పట్ల అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీనోమ్ సీకెన్స్ ఇచ్చిన రిపోర్ట్లు సాయంత్రం వస్తాయని, కోవిడ్ సోకిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలకు వెళ్లి చికిత్స చేసుకోవాలని కోరారు. మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో వున్నాయని. ఒమిక్రాన్ అని తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ ఒకటే మార్గమని తెలిపారు.

బూస్టర్ డోసు
ఫ్రంట్లైన్ వర్కర్లకు మరొక బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని శ్రీనివాసరావు చెప్పారు. చిన్న పిల్లలకు వాక్సినేషన్ ఇచ్చే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామని వివరించారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని కోరారు. సౌత్ఆఫ్రికాలో ప్రతి నలుగురిలో ఒక్కరికే వాక్సినేషన్ జరిగిందని, అందుకే అక్కడ కొత్త వేరియేంట్ పుట్టుకొచ్చిందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో లాక్డౌన్ పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

వేగంగా ఇన్ ఫెక్షన్.. కానీ
ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది కానీ, ఓమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు వుండటం లేదని ఆయన తెలిపారు. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయి. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవని ఆయన వివరించారు. అలాగే కేసులు దాస్తున్నామనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోటానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉందన్నారు. తప్పుడు వార్తల వల్ల వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం తగ్గుతుందని, కోవిడ్ రోగులను దాచలేమని చెప్పారు. కోవిడ్ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమైనవని, వాటితో ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారు.

ఊహాగానాలే
ఇటు హైదరాబాద్లో దిగిన ఓ లండన్ యువతీ నమూనాలను కూడా జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. రాజస్తాన్, మిగత చోట్ల కూడా అనుమానితులు ఉన్నారు. కానీ వారికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నిర్ధారణ మాత్రం కాలేదు. ప్రస్తుతం ఉన్న ఐదు కేసులు తగ్గితే సరిపోతుంది. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాప్తి చెందితెనే ప్రమాదం.












Click it and Unblock the Notifications