బీజేపీలోకి విజయశాంతి..!!? రంగంలోకి అమిత్ షా దూతలు: సీఎం కేసీఆర్ లక్ష్యంగా..!
లేడీ అమితాబ్ విజయశాంతి తిరిగి రాజకీయ స్వగృహానికి వెళ్లిపోతున్నారా. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన బీజేపీ..ఇప్పుడు ఆపరేషన్ స్వగృహకు తెర లేపింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా..ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఉన్నా..జనాకర్షణ నేత లేకపోవటంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామనే భావనలో ఉన్నారు. దీని కోసం వారు ఇప్పుడు విజయ శాంతి మీద దృష్టి సారించారు. రాజకీయంగా బీజేపీతో విస్తృత సంబంధాలు ఉన్న విజయశాంతి అనేక మలుపులు తీసుకున్న తరువాత ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. అయితే, పార్టీలో నేతలు అమెకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదు. దీంతో..కేవలం ట్విట్టర్లు..ఫేస్బుక్ పోస్టింగ్లకే విజయ శాంతి పరిమితమయ్యారు. సరిగ్గా ఇదే సమయం లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దూతలు విజయశాంతితో మంతనాలు ప్రారంభించారు. విజయశాంతి సూత్ర ప్రాయంగా అంగీకరించారని..తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్లో అసంతృప్తితో విజయశాంతి...
సినీ నటి..ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా బీజేపీ..తెలంగాణ సాధన కోసం సొంత పార్టీ..టీఆర్యస్..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల్లో విజయశాంతి పని చేసారు. నాడు ఎంపీగా తెలంగాణ సాధన సమయంలో కేసీఆర్తో పాటుగా ఉన్న మరో ఎంపీ విజయశాంతి మాత్రమే. అయితే, తెలంగాణ వచ్చిన తరువాత పార్టీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో విజయశాంతి బయటకు వచ్చేసారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పని చేసారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తరువాత పార్టీలో ఉంటూనే అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగే కార్యక్రమాలకు తగిన రీతిలో ఆహ్వానం కానీ..కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదనే ఆవేదనతో విజయ శాంతి ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కేవలం..ట్విట్టర్..ఫేజ్బుక్ ద్వారా కేసీఆర్ మీద విమర్శలకు పరిమితం అయ్యారు. దీనిని బీజేపీ అధినాయకత్వం గుర్తించింది.
విజయశాంతిని తిరిగి బీజేపీలోకి తెచ్చేందుకు..
ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఇక్కడ జరుగుతున్న ప్రతీ పరిణామం మీద దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా బీజేపీ సొంతంగా నాలుగు ఎంపీ సీట్లు గెలవటంతో తెలంగాణలో తమకు భవిష్యత్ ఉందనే నమ్మకం మరింత పెరిగింది. అయితే, ప్రజల్లో ఆదరణ ఉన్నా..ప్రజాకర్షణ ఉన్న నేత..పార్టీని సమర్ధ వంతంగా ముందుడి నడిపించే నేత కావాలని బీజేపీ అన్వేషిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ మీద పదునైన విమర్శ ల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న తమ పార్టీ మాజీ నేత విజయశాంతి మీద నేరుగా బీజేపీ అధినేత అమిత్ షా దృష్టి సారించారు. తమ దూతల ద్వారా రాయబారం పంపారు. బీజేపీలోకి రావాలని తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తొలుత సుముఖంగా కనిపించక పోయినా..విజయశాంతి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి..తనకు ప్రాధాన్యత లేకపోవటం చూసి..బీజేపీ వైపు ఆఫర్ వచ్చినప్పుడే అవకాశం సద్వినియోగం చేసుకోవాల నే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా...
టీఆర్యస్ ఎంపీగా ఉన్న సమయం నుండే విజయశాంతి పూర్తిగా కేసీఆర్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు కేసీఆర్ మీద అదే వైఖరితో ఉన్నారు. ఇప్పుడు విజయశాంతిని బీజేపీలోకి ఆహ్వానించి ప్రాధాన్యత ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ నేతల అంచనాగా కనిపిస్తోంది. స్వయంగా అమిత్ షా తెలంగాణ నుండే సభ్యత్వం తీసుకొని పార్టీలో జోష్ నింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాను బీజేపీలో చేరే అంశం పైన ఇప్పటి వరకు విజయశాంతి స్పష్టత ఇవ్వకపోయినా..అమె త్వరలోనే తమ పార్టీలో చేరుతారని ఢిల్లీలోని బీజేపీ ముఖ్యులు చెబుతున్నారు. మరి.. ప్రస్తుతం సినిమా షూటింగ్లో ఉన్న విజయశాంతి తన పార్టీ మార్పు పైన ఎలా స్పందిస్తారో చూడాలి..