నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ షాక్... రూ.1లక్ష జరిమానా... ఆ నిబంధనలు అతిక్రమించినందుకు..
సినీ నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.1లోని తన నివాసానికి నిబంధనలకు విరుద్దంగా హోర్డింగ్ అమర్చడమే కాకుండా లైటింగ్ ఏర్పాటు చేసినందుకు రూ.1లక్ష జరిమానా విధించారు. ఈ మేరకు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్దంగా 15అడుగుల ఎత్తులో హోర్డింగ్ ఏర్పాటు చేశారని... దీనికి ఎటువంటి అనుమతి తీసుకోలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.
ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటివి ఏర్పాటు చేయడం సంబంధిత సెక్షన్ల ప్రకారం నేరమని, కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది. జీహెచ్ఎంసీ నోటీసులపై మోహన్ బాబు కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకూ స్పందించలేదు.
ప్రస్తుతం మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన దేశభక్తుడి పాత్రలో కనిపించనున్నారు.శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు చిరంజీవి 'ఆచార్య' సెట్స్పై కనిపించడంతో అందులో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారంటూ గుసగుసలు వినిపించాయి. దీనిపై స్పందించిన మోహన్ బాబు పీఆర్వో... ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా తప్ప మరో చిత్రాన్ని ఆయన అంగీకరించలేదని తెలిపారు. ఆయన కొత్త సినిమాలు అంగీకరిస్తే ఆ విషయాన్ని తాము అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
సన్నాఫ్ ఇండియా సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మోహన్ బాబు ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. గడ్డం,మెడలో రుద్రాక్ష మాలలో ఆయన రఫ్ లుక్లో కనిపించారు. సమకాలీన రాజకీయ పరిస్థితులను సగటు భారతీయుడి కోణంలో ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.